జీవీకే గ్రూపు వ్యవహారం.. రంగం లోకి ఈడీ

| Edited By: Pardhasaradhi Peri

Jul 04, 2020 | 2:09 PM

మనీ లాండరింగ్ కేసులో జీవీకే గ్రూపు ప్రమోటర్లు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కొందరిపై ఈడీ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే సీబీఐ ఈ కేసు వ్యవహారంలో..

జీవీకే గ్రూపు వ్యవహారం.. రంగం లోకి ఈడీ
Follow us on

మనీ లాండరింగ్ కేసులో జీవీకే గ్రూపు ప్రమోటర్లు, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కొందరిపై ఈడీ విచారణ ప్రారంభించింది. ఇప్పటికే సీబీఐ ఈ కేసు వ్యవహారంలో రూ. 705 కోట్ల స్కామ్ జరిగినట్టు గుర్తించింది. జీవీకే గ్రూపు చైర్మన్  జీవీకే రెడ్డి, ఆయన కుమారుడు జీవీ సంజయ్ రెడ్డి, ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి చెందినవారితో సహా  మొత్తం 14 మందిపై   గత జూన్ 27 న క్రిమినల్ కేసును దాఖలు చేసింది. ఛీటింగ్, ఫ్రాడ్, క్రిమినల్ కుట్ర వంటి పలు అభియోగాలను మోపింది. వీరి కారణంగా ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్లకు పైగానే నష్టం వాటిల్లిందని అంచనా వేసింది. హైదరాబాద్ లో జీవీకే రెడ్డితో కార్యాలయంతో బాటు ముంబైలో ముంబై ఇంటర్నేషల్ ఎయిర్ పోర్టుకు చెందిన అధికారుల ఆఫీసులపై కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది.

2012 నుంచే ఈ ప్రమోటర్ల అవకతవకల వ్యవహారం ప్రారంభమైనట్టు ఈ దర్యాప్తు సంస్థ గుర్తించింది. ‘ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వహణ, మేనేజ్ మెంట్, డెవలప్ మెంట్ వంటి ‘ఉన్నత ఆదర్శాలతో’ జీవీకే ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ జాయింట్ వెంచర్ 2006 లోనే ఏర్పడినప్పటికీ.. ఆ తరువాత అక్రమాలు మొదలయ్యాయి. 2012 లో రూ. 395 కోట్ల దుర్వినియోగం జరిగిందని, ఎయిర్ పోర్ట్ ప్రీమియం  రీటైల్ ఏరియాని ఈ గ్రూపు తమ కుటుంబ సభ్యులు, బంధువులకు చాలా తక్కువ రెంటల్స్ తో అప్పగించారని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. బోగస్ కాంట్రాక్టులు, తొమ్మిది బేనామీ ఎంటిటీలు సాగించిన అవకతవకలపై దర్యాప్తు జరుగుతోందన్నారు. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ కంపెనీ అక్కడి సంస్థ అయినప్పటికీ.. ఈ ప్రమోటర్లు నిధులను ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో హైదరాబాద్ లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా  బ్రాంచిలో మదుపు చేశారని వెల్లడైంది. కాగా-  తాము  కనుగొన్న అంశాలను సీబీఐ..ఈడీకి వివరించనుంది.