Kerala: కేరళలో కుంభవృష్టి.. భారీగా ప్రాణనష్టం.. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్

|

Aug 05, 2022 | 6:56 AM

కేరళ (Kerala) లో కుండపోతగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. 8 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 8 తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని...

Kerala: కేరళలో కుంభవృష్టి.. భారీగా ప్రాణనష్టం.. ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్
Kerala Rains News
Follow us on

కేరళ (Kerala) లో కుండపోతగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఇప్పటి వరకు 18 మంది మృతి చెందారు. 8 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ నెల 8 తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, కన్నూర్ జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. వరదలతో కారణంగా రోడ్లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించిపోయి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొండ చరియలు విరిగిపడడం తో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ముందస్తు జాగ్రత్తగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రాష్ట్రంలోని ప్రధాన ఆనకట్టలైన పొన్ముడి, లోయర్ పెరియార్, కల్లార్‌కుట్టి, ఇడుక్కిలోని ఎరట్టయార్, పతనంతిట్ట జిల్లాలోని మూజియార్ తో సహా అన్ని ప్రధాన ఆనకట్టలు నిండుకుండల్లా మారాయి. వరద ముప్పు గ్రామాలలో ప్రజలను రక్షించి సహాయ శిబిరాలకు తరలించారు. గల్లంతయిన వారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మినహా మిగతా అన్ని జిల్లాలకు కేరళ ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చాలక్కుడి, పంపా, మణిమాల, అచ్చంకోవిల్ వంటి నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. త్రిస్సూర్, ఎర్నాకులం జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం పినరయి విజయన్ కోరారు. వాతావరణం సహకరించకపోవడంతో
గల్ఫ్ నుంచి కోజికోడ్ కు వచ్చే 5 విమానాలను కొచ్చిన్ విమానాశ్రయానికి దారి మళ్లించారు. రాత్రి పూట కొండ ప్రాంతాల్లో ప్రయాణాలను చేయవద్దని, నదులు, సరస్సుల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.

మరోవైపు.. తమిళనాడులోని కావేరి (Kaveri River) నదికి వరద పోటెత్తుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలు, వస్తున్న వరదలతో నది హద్దులు దాటి ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డెల్టా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కన్యాకుమారి, తేని లోని జలపాతాలను మూసివేశారు. వైగై జలాశయం నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు నీటమునిగాయి. సేలంలోని మెట్టూరు డ్యాం కు భారీగా వరద వస్తోంది. తిరుచ్చి, తంజావూర్, నాగపట్నం , మైలాడుతురై తో సహా కావేరీ నది పరివాహక జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి