నీటిని మించిన ఔషధం మరోటి లేదంటారు. మనిషి ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగమని చెబుతుంటారు. అయితే, అన్ని సార్లు నీరు తాగడం మంచిదేనా..? నీరు తాగకూడని సందర్భాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
మనిషి హైడ్రేటెడ్ గా ఉండాలన్నా.. అదనపు క్యాలరీలు బర్న్ చేయడానికైనా నీరు తాగాలంటారు..అవసరమున్నంత వరకూ ఓకే.. కానీ ఎక్కువ శాతం నీరు తాగితే మన బాడీలో ఉన్న ఉప్పు విలువలు అమాంతం తగ్గిపోయే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు. అదే పనిగా నీటిని తీసుకోవడం వల్ల బాడీకి అవసరమయ్యే సోడియం లెవల్స్ తగ్గిపోయే అవకాశం ఉంది..దీన్నే హైపోనాట్రేమియా అంటారు.
రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి అనేది అన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చు. మరి ఎంత నీరు తాగాలి అంటే అది తేల్చుకునే మెకానిజం కూడా మీ బాడీలోనే ఉంటుంది. మూత్రానికి వెళ్లినప్పుడు అది క్లియర్ గా వాటర్ కలర్లో ఉంటే, మీరు సరిపడా నీరు తాగుతున్నట్టే, అలా కాకుండా ముదురు పసుపు రంగులో ఉంటే మీ బాడీకి ఇంకాస్త నీరు అవసరమున్నట్టు లెక్క..
ఇంతే కాదు, చాలా ఎక్కువ భోజనం చేసినప్పుడు కూడా సాధ్యమైనంత వరకు తక్కువ నీటిని తీసుకుంటే మంచిదంటారు. కడుపులో అంత ఫుడ్తో పాటు ఎక్కువ నీరు తీసుకుంటే అది కడుపు ఉబ్బరానికి దారి తీస్తుంది.
ఎక్కువ సేపు వ్యాయామం చేసినా..ఏదైనా యాక్టివిటీలో పాల్గొని చెమటోడ్చినా వెంటనే నీటిని తాగరాదు. ఎందుకంటే మన బాడీలోని పొటాషియం, సోడియం లాంటి ఎలక్ట్రోలైట్స్ చెమటతో పాటు నష్టపోతాయి. ఇలాంటి హెవీ వర్కవుట్స్ చేసినప్పుడు మంచినీరు కాకుండా, కొబ్బరినీళ్లు లేదా స్పోర్ట్స్ డ్రింక్స్ లాంటివి తాగడం మంచిదంటున్నారు డాక్టర్లు. ఇక మార్కెట్లో దొరికే ఫ్లేవర్డ్ నీటికి కూడా వీలైనంత దూరంగా ఉండాలి. అందులో వేసే కృత్రిమ ఫ్లేవర్స్, లేదా స్వీట్నర్స్ బాడీకి మేలు కంటే నష్టాన్నే కలగజేస్తాయి.ఫ్లేవర్డ్ వాటర్ కావాలనుకుంటే మనం తాగే నీటిలోనే.. కొద్ది మోతాదులో నిమ్మకాయ రసం లేదా కీరా రసం వేసుకుంటే సరిపోతుంది.