యూపీలో ఘోరం, శానిటైజర్ చల్లి జర్నలిస్ట్ సజీవ దహనం, ముగ్గురి అరెస్ట్, మరికొందరిపైనా పోలీసునిఘా

| Edited By: Anil kumar poka

Dec 01, 2020 | 11:23 AM

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. శానిటైజర్ చల్లి ఓ జర్నలిస్టును, అతడి స్నేహితుడిని దుండగులు సజీవ దహనం చేశారు. లక్నో కు 160 కి.మీ. దూరంలోని బలరాం పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో పోలీసులు గ్రామ పెద్ద కుమారునితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు.

యూపీలో ఘోరం, శానిటైజర్ చల్లి జర్నలిస్ట్ సజీవ దహనం, ముగ్గురి అరెస్ట్, మరికొందరిపైనా పోలీసునిఘా
Follow us on

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. శానిటైజర్ చల్లి ఓ జర్నలిస్టును, అతడి స్నేహితుడిని దుండగులు సజీవ దహనం చేశారు. లక్నో కు 160 కి.మీ. దూరంలోని బలరాం పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో పోలీసులు గ్రామ పెద్ద కుమారునితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. లక్నోలో ‘రాష్ట్రీయ స్వరూప్’ అనే డైలీకి వార్తలు రాసే 37 ఏళ్ళ రాకేష్ సింగ్ నిర్భీక్, తన మిత్రుడు పింటూ సాహుతో బాటు గతనెల 27 న తీవ్ర గాయాలకు గురై కనిపించాడు. కల్వరి గ్రామ వాసి అయిన రాకేష్ ఇంట్లో ఇలా వీరిద్దరినీ స్థానికులు కనుగొన్నారు. గాయాలతో సాహు మొదట మరణించగా, రాకేష్ ని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. అయితే లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. తన మరణానికి ముందు ఆయన.. కల్వరి గ్రామ పెద్ద, అతని కొడుకు అవినీతి గురించి వార్తలు రాసినందుకు తనపై కక్ష తీర్చుకున్నారని తెలిపాడు. వాస్తవాలను బయటపెట్టినందుకు నామీద ఇలా హత్యాయత్నం చేసారని పేర్కొన్నాడు. బాధతో విలవిలలాడుతూ రాకేష్ చెప్పిన రెండున్నర నిముషాల వీడియో సంచలనమైంది.

ఈ ఘటన జరిగిన 4 రోజుల అనంతరం… తాము ముగ్గురిని అరెస్టు చేశామని, మరికొందరి కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీరిలో రింకు మిశ్రా అనే వ్యక్తి గ్రామ పెద్దఅక్రమ్  కొడుకని, అక్రమ్ పై మర్డర్ కేసుతో తో బాటు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని వారు చెప్పారు. అక్రమ్ స్నేహితుడైన మరొకరికి కూడా జర్నలిస్టు హత్యతో ప్రమేయం ఉన్నట్టు తేలిందన్నారు. ఈ నేరాన్ని వీరు యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు యత్నించారని, కానీ తమ దర్యాప్తులో ఇది జంట హత్యలని వెల్లడైందని అన్నారు. ఇది ఓ కుట్ర ప్రకారం జరిగినట్టు నిర్ధారించుకున్నామన్నారు. రాకేష్ సింగ్ జర్నలిస్ట్ అన్న కసి ఈ నేరంలో ఓ భాగం కాగా-మిశ్రాకు, పింటూ సాహుకు మధ్య  ఉన్న ఓ డబ్బు చెల్లింపు వివాదం కూడా మరో భాగమని పోలీసులు తెలిపారు. నిర్భయంగా వార్తలు రాసే రాకేష్ సింగ్ ని దుండగులు తమ మొదటి టార్గెట్ చేసుకున్నారని వారు చెప్పారు. గత నెల 27 న మిశ్రాకు, సాహుకు మధ్య ఓ బార్ వద్ద ఘర్షణ జరిగిందని, బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకుని సాహును కూడా హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోందని ఖాకీలు పేర్కొన్నారు. ఏమైనా ఆల్కహాలుతో కూడిన శానిటైజర్ ను చల్లి హత్యలు చేయడం తమ దర్యాప్తు  కేసులో బయటపడడం ఇదే మొదటిసారని పోలీసులు తెలిపారు.