ఎట్టకేలకు బ్రెగ్జిట్ ఒప్పందానికి బ్రిటన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఏళ్లుగా కొనసాగిన ఉత్కంఠకు తెరపడింది. హౌజ్ ఆఫ్ కామన్స్లో జరిగిన ఓటింగ్లో బ్రెగ్జిట్ బిల్లుకు అనుకూలంగా 330 ఓట్లు, వ్యతిరేకంగా 231 ఓట్లు వచ్చాయి. ఈ నెల 31న ఈయూ నుంచి అధికారికంగా వైదొలగనుంది బ్రిటన్. ఐరోపా సమాఖ్య నుంచి విడిపోతున్న మొదటి దేశంగా అవతరించనుంది. ఈ బిల్లు హౌజ్ ఆఫ్ లార్డ్స్, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. ఐతే అది లాంఛనమే కానుంది.
50 ఏళ్లుగా ప్రధాన వాణిజ్య భాగస్వామిగా ఉన్న ఈయూ నుంచి వేరుపడనుంది బ్రిటన్. బ్రెగ్జిట్పై తొలి నుంచి వాదోపవాదాలు, చర్చోపచర్చలు కొనసాగినా..తాజా ఓటింగ్తో ప్రతిష్టంభనకు తెరపడింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీకి పూర్తి మెజార్టీ రావడంతో బిల్లు పార్లమెంట్లో సునాయాసంగా గట్టెక్కింది. విపక్ష లేబర్ పార్టీ బ్రెగ్జిట్కు వ్యతిరేకంగా ఓటేసింది.
ఈయూ నుంచి విడిపోతే బ్రిటన్ సామాన్య దేశంగా మిగిలిపోతుందని, వాణిజ్యపరంగా నష్టపోతుందని పలువురు వాదించగా.. బ్రెగ్జిట్తో బ్రిటన్కు లాభమేనని, గత వైభవం సాధించేందుకు ఇదే మార్గమని మరి కొందరు వాదించారు. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్ బిల్లుకు పార్లమెంట్ గ్రీన్సిగ్నలిచ్చింది. జనవరి 31న ఈయూ నుంచి విడిపోతున్నాం. ప్రధాని ఇచ్చిన హామీ నెరవేరబోతోందని జాన్సన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.