తమిళనాడులో తండ్రీ కొడుకులు జయరాజ్, బెర్కిన్స్ పోలీసు కస్టడీలో మృతి చెందిన ఘటన మరవక ముందే సరిగ్గా అలంటి ఘటనే మరొకటి జరిగింది. ఎన్.కుమరేశన్ అనే ఆటో డ్రైవర్ పోలీసు కస్టడీలో తీవ్ర గాయాలకు గురై.. పదిహేను రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మరణించాడు. ఓ భూ వివాదం కేసులో అతడిని పోలీసులు తీసుకువెళ్లారు. లాకప్ లో అతడిని తీవ్రంగా కొట్టారని, మరునాడు ఇంటికి వచ్చికూడా ఏమీ మాట్లాడలేకపోయాడని అతని బంధువులు తెలిపారు. కాగా రక్తపు వాంతులతో బాధపడుతున్న కుమరేశన్ ని మొదట స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లామని, కానీ పరిస్థితి మరింత విషమించడంతో , తిరునల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే అతని కిడ్నీ, ఇతర అవయవాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని డాక్టర్లు చెప్పారన్నారు. చివరకు శనివారం సాయంత్రం కుమరేశన్ మరణించాడు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులపై ఉన్నతాధికారులు కేసు పెట్టారు. తమిళనాడు లోని ట్యుటికోరన్ లో సెల్ షాపు యజమానులైన జయరాజ్ ఆయన కుమారుడు కూడా పోలీసు కస్టడీలో తీవ్ర గాయాలకు గురై మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్త సంచలనం రేపింది. ఇది పొలిటికల్ హీట్ కి కూడా దారి తీసింది.