అన్నాడీఎంకే నుంచి బహిష్కృత నేత, తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు శశికళ ఆరోగ్యం నిలకడగా ఉందని బెంగుళూరులో ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అయితే ఆమెకు మరిన్ని టెస్టులు నిర్వహించాల్సి ఉందని ఈ వర్గాలు పేర్కొన్నాయి. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఈమెను నిన్న జైలు నుంచి ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. ఆమెకు కోవిడ్ టెస్టులు నిర్వహించగా నెగటివ్ రిపోర్టు వఛ్చినట్టు డాక్టర్లు తెలిపారు. ఆమెకు గురువారం సీటీ, ఇతర పరీక్షలు నిర్వహించారు. శశికళ ఆసుపత్రిలో నడవగలుగుతున్నారని, రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. దగ్గు, జ్వరం కూడా తగ్గాయన్నారు. అయితే కొంతవరకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ సుమారు నాలుగేళ్లు పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. ఈ నెల 27 న ఆమె జైలు నుంచి విడుదల కావలసి ఉంది.