కరోనా భయంతో బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2.. రాజభవనం ‘బకింగ్ హాం ప్యాలస్’ ను వీడుతున్నారు. 93 ఏళ్ళ ఈమెను ఈ ప్యాలస్ కి దూరంగా ఉన్న విండ్సర్ కేజిల్ కి తీసుకువెళ్లారు. అక్కడ ఆమె దాదాపు ఐసొలేషన్ లో ఉంటారని ఈ ప్యాలస్ వర్గాలు తెలిపాయి. బ్రిటన్ లో కరోనా కారణంగా మరో 10 మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 21 కి పెరిగింది.
విండ్సర్ గ్రేట్ పార్క్ లోని ఓ భవంతిలో గల సిబ్బందిలో ముగ్గురికి కరోనా లక్షణాలు కనబడడంతో ఆ భవనాన్ని పెద్ద ఎత్తున శుభ్రం చేస్తున్నారు. కాగా.. బ్రిటన్ లో ఎప్పుడూ జనసమ్మర్థంతో కనిపించే అనేక ప్రాంతాలు, రోడ్లు, కరోనా కారణంగా జనం లేక బోసిపోతున్నాయి. సదా రద్దీగా ఉండే బకింగ్ హాం ప్యాలస్ నిర్మానుష్యంగా మారింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యికి పైగా పెరిగింది. అయితే ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.