కరోనా వైరస్ చికిత్సకు అమోఘమైన మందు అంటూ పతంజలి సంస్థ ‘కొరొనిల్’ టాబ్లెట్లను లోగడ ఇండియాలో లాంచ్ చేశారు. బాబా గురు రామ్ దేవ్ బాబా వీటిని ప్రెస్ మీట్ లో విడుదల చేశారు. అయితే భారత వైద్య అధికారులు దీనికి ఆమోదం లేదంటూ తిరస్కరించడంతో మార్కెట్ లో ఇవి కనిపించలేదు. అమ్మకాలు నిలిచిపోయాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్పుకున్న ఈ మాత్రల బాటిల్స్ ఇప్పుడు తాజాగా లండన్ షాపుల్లో దర్శనమిస్తున్నాయి. బ్రిటన్ ప్రకటనల ప్రమోషన్ నిబంధనల ప్రకారం ఇలాంటి దేశీయ మాత్రలను నిషేధిస్తున్నారు. కొరొనిల్ ను వాడరాదని, దీనికి ఆమోదం లేదని మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రాడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ పేర్కొంది. అనధికారికంగా ఈ విధమైన మెడిసిన్ ఉత్పత్తులను మార్కెట్ లో విక్రయించరాదని, అమ్మితే తగిన చర్యలు తీసుకుంటామని ఈ సంస్థ హెచ్ఛరించింది. కొరొనిల్ ను టెస్ట్ చేయగా కోవిడ్ నుంచి ఎలాంటి రక్షణ ఇవ్వదని తేలింది. ఇది మొక్కల మూలికలతో కూడి ఉందని, కానీ దీనివల్ల ప్రయోజనం లేదని వెల్లడైంది.
వైరాలజిస్ట్ డాక్టర్ మైత్రేయి శివకుమార్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కాగా-కొరొనిల్ ఎలా లండన్ చేరిందన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై పతంజలి సంస్థ ఎలాంటి కామెంట్ చేయలేదు.