రైతు చట్టాలపై ఎన్డీయేతో అకాలీదళ్ తెగతెంపులు చేసుకున్న అనంతరం తాజాగా మరో మిత్ర పక్షం కూడా ఇందుకు సిధ్ధపడుతోంది. రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ చీఫ్, రాజస్తాన్ ఎంపీ హనుమాన్ బేనీవాల్..ఈ వివాదాస్పద చట్టాలను మూడింటినీ కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి ట్వీట్ చేసిన ఆయన..డిసెంబరు 3 వ తేదీకన్నా ముందే..వెంటనే రైతులతో కేంద్రం చర్చలు జరపాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్నదాతలు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారని, స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను కేంద్రం వెంటనే అమలు చేయాలని అన్నారు. మేము ఎన్డీయేలో భాగస్వాములమైనా మాకు శక్తి రైతుల నుంచి, జవాన్ల నుంచి వస్తుంది అని హనుమాన్ బేనీవాల్ పేర్కొన్నారు.మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే ఎన్డీయే నుంచి వైదొలగాలన్న ప్రతిపాదన గురించి యోచించాల్సి ఉంటుందన్నారు.
హనుమాన్ బేనీవాల్ పార్టీకి రైతుల నుంచి, జాట్ల నుంచి మద్దతు పూర్తిగా ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు అన్నదాతలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని ఆయన కోరారు. అవసరమైతే తమ రాష్ట్రం నుంచి లక్షలాది రైతులతో తాను కూడా ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేస్తానని ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఇంతేకాదు…. దేశవ్యాప్త ఆందోళనకు కూడా మేం సిధ్ధం అని హనుమాన్ బేనీవాల్ పరోక్షంగా హెచ్చరించారు. మేము కూడా అకాలీదళ్ బాటలో నడవడానికి రెడీ అని పేర్కొన్నారు.