శబరిమల ఆలయానికి భక్తుల సంఖ్యను పెంచడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన కేరళ సర్కార్‌

|

Dec 24, 2020 | 4:21 PM

కరోనా వైరస్‌ను కంట్రోల్‌ చేయాలన్న ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం ఆలయాల సందర్శనకు వచ్చే భక్తులపై పరిమితి విధించింది. అయితే హైకోర్టు భక్తుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో..

శబరిమల ఆలయానికి భక్తుల సంఖ్యను పెంచడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన కేరళ సర్కార్‌
Follow us on

కరోనా వైరస్‌ను కంట్రోల్‌ చేయాలన్న ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం ఆలయాల సందర్శనకు వచ్చే భక్తులపై పరిమితి విధించింది. అయితే హైకోర్టు భక్తుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. భక్తుల సంఖ్యను పెంచడం వల్ల పోలీసులు, ఆరోగ్య సిబ్బందిపై పెనుభారం పడుతుందనేది కేరళ ప్రభుత్వం వాదన! డిసెంబర్‌ 20 నుంచి జనవరి 14 వరకు మండల పూజ సీజన్‌ కాబట్టి భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న కమిటీ భక్తుల సంఖ్యపై పరిమితి విధించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు కేవలం రెండు వేల మంది భక్తులనే అనుమతిస్తున్నారు. శని, ఆదివారాలలో మాత్రం మూడు వేల మందికి అయ్యప్పస్వామిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. అయితే భక్తుల సంఖ్యపై పరిమితులు విధించడాన్ని సవాల్‌ చేస్తూ కొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు రోజువారీ భక్తుల సంఖ్యను అయిదు వేలకు పెంచింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. హైకోర్టు ఎలాంటి ప్రాథమిక నివేదకలను పరిగణనలోకి తీసుకోకుండానే భక్తుల సంఖ్యను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిందన్నది రాష్ట్ర ప్రభుత్వం వాదన. ఇప్పుడున్న పరిస్థితులలో భక్తుల సంఖ్యను పెంచితే పోలీసులపై భారం పడుతుందని, ఆరోగ్య సిబ్బందికి కూడా కష్టమవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.