Telangana chief minister KCR anger on central government: గులాబీ దళపతి మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రాలపై మోదీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను చూపిస్తోందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు కాంగ్రెస్ నేతలు పాటించిన విధానాలను అవలంభిస్తున్న బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే త్వరలో పడుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు నీచపు బుద్ది ప్రదర్శిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు.
వార్షిక బడ్జెట్పై జరిగిన చర్చ చివరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపు అసెంబ్లీలో మాట్లాడారు. కేంద్రం నిధుల వితరణలో రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తోందని చెప్పారాయన. ఒకప్పుడు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తరహాలో వ్యవహరించేవారని, ప్రస్తుతం వారి విధానాలనే బీజేపీ అధినేతలు నరేంద్రమోదీ, అమిత్షా పాటిస్తున్నారని సీఎం అన్నారు. కేంద్రానికి అధిక సంఖ్యలో నిధులను తెచ్చిపెడుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని గుర్తు చేశారాయన.
తెలంగాణ నుంచి కేంద్రానికి 50 వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుండగా.. కేవలం 24 వేల కోట్ల రూపాయలను మాత్రమే కేంద్రం తెలంగాణకు కేటాయిస్తోందని వివరించారు కేసీఆర్. దేశాన్ని భ్రమింపచేసే పనిలో బీజేపీ నేతలు బిజీగా వున్నారని కామెంట్ చేశారు కేసీఆర్. విధానాలు మార్చుకోకుంటే బీజేపీకి కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు కేసీఆర్.