తండ్రి వైఎస్ఆర్ తెచ్చిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తేసేందుకే నగదు బదిలీ పథకాన్ని తనయుడు జగన్ తీసుకొస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు విమర్శించారు. సజావుగా సాగుతున్న ఉచిత పథకంలో నగదు బదిలీ చేపట్టడం రైతులను ఇబ్బంది పెట్టడానికే అని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్కు నగదు బదిలీ పథకం పెట్టడమనేది ఒక తుగ్గక్ నిర్ణయమని ఆయన విమర్శించారు. రైతుల కోసమే సౌర విద్యుత్ అని చెప్పడం కూడా బూటకమేనన్న ఆయన.. రైతుల కోసమే అయితే.. మీటర్లు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. విద్యుత్ సంస్థలను సమర్థవంతంగా నడపడంలో విఫలమై రైతులపై భారం వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం రైతులను వంచించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత నిర్ణయంతో చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతారని కళా అన్నారు. అసలు ఏపీలో రైతులు ఎంత మంది ఉన్నారు.. కౌలు రైతులు ఎంత మంది ఉన్నారు, వాళ్లలో బ్యాంక్ అకౌంట్ ఎంతమందికి ఉందో ప్రభుత్వం వద్ద లెక్కలు ఉన్నాయా అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు.