ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ యాదవ్ ఆడియో క్లిప్ వ్యవహారంపై దర్యాప్తునకు ఝార్ఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. బీహార్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా జరిగే ఓటింగ్ లో పాల్గొనరాదంటూ ఎన్డీయే ఎమ్మెల్యే ఒకరికి లాలూ యాదవ్ ఫోన్ చేసినట్టు చెబుతున్న ఓ ఆడియో క్లిప్ సంచలనం సృష్టించింది. ఇలా చేసిన పక్షంలో ఆర్జేడీ అధికారం లోకి రాగానే మీకు మంత్రి పదవి ఇస్తామంటూ ఆయన చెప్పినట్టు వెల్లడైంది. అయితే ఈ ఆడియో టేపులోని గొంతును తాను కూడా విన్నానని, రాంచీ జైళ్ల ఐజీ వీరేంద్ర భూషణ్ తెలిపారు. దీనిపై విచారణ చేపట్టాలని రాంచీ డీసీపీ, ఎస్పీలను, బిర్సా ముందా జైలు సూపరింటెండెంట్ ను ఆదేశించానని, ఆ గొంతు లాలూదేనని రుజువైన పక్షంలో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఒక వ్యక్తి జుడిషియల్ కస్టడీలో ఉండగా జైల్లో మొబైల్ ఫోన్ వినియోగించరాదని, అలాగే ఎలాంటి రాజకీయ చర్చలూ జరపరాదని ఆయన వివరించారు.
పశుగ్రాసం స్కామ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కి ఓ కేసులో బెయిల్ లభించగా మరో కేసులో ఇంకా లభించలేదు.