ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలను అదుపులోకి తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రభుత్వ యాజమాన్యంలోని వాణిజ్య సంస్థ ఎమ్ఎమ్టిసి, దేశీయ సరఫరాను పెంచడానికి, పెరుగుతున్న ధరలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా టర్కీ నుండి 11,000 టన్నుల ఉల్లిపాయలను ఆర్డర్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈజిప్ట్ నుండి 6,090 టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంటోంది. దేశీయ ఉల్లి సరఫరా, ధరల నియంత్రణకు 1.2 లక్షల టన్నుల ఉల్లిపాయలను దిగుమతి చేసుకోవడానికి గత నెలలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రం ఇప్పటికే ఎగుమతులను నిషేధించింది.
ఈజిప్ట్ నుండి దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను ముంబైలో కిలో 52-55 రూపాయలు, ఢిల్లీలో కిలో 60 రూపాయల చొప్పున పంపిణీ చేయడానికి రంగం సిద్దమైంది. ఉల్లి ధరలను పర్యవేక్షించడానికి, హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మంత్రుల బృందాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్లో ఆర్థిక మంత్రి, వినియోగదారుల వ్యవహారాల మంత్రి, వ్యవసాయ మంత్రి, రోడ్డు రవాణా మంత్రి కూడా సభ్యులుగా ఉన్నారు.