అమెరికా ఎన్నికల్లో ముఖ్యంగా పెన్సిల్వేనియా రాష్ట్రంలో జరిగిన ఎన్నికలో జో బైడెన్ ని విజేతగా ప్రకటించరాదంటూ డొనాల్డ్ ట్రంప్ వేసిన దావాను ఫెడరల్ అపీళ్ల కోర్టు తిరస్కరించింది. ఇది ఆయనకు మరో దెబ్బగా పరిణమించింది. స్వేచ్చగా, సజావుగా జరిగే ఎన్నికలే ప్రజాస్వామ్యానికి మూలస్తంభాలని, ఫ్రాడ్ జరిగిందన్న ఆరోపణలు సీరియస్ వే అయినా, అసలు ఎన్నికే మోసపూరితమనడం సమంజసం కాదని ముగ్గురు జడ్జీల తరఫున స్టెఫనోస్ బైబాస్ అనే న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అభియోగాలు, ఆరోపణలకు ఆధారాలు ఉండాలని, కానీ ఇక్కడ తమకు ఎలాంటి ఆధారాలూ కనిపించలేదని ఆయన చెప్పారు. ‘లాయర్లు కాదు, ఓటర్లు అధ్యక్షుడిని ఎన్నుకుంటారు, ప్రెస్ మీట్లు కావు, బ్యాలెట్లు ఎన్నికను నిర్ణయిస్తాయి’ అని ఆయన అన్నారు. పెన్సిల్వేనియాలో జో బైడెన్ 80 వేలకు పైగా ఓట్లు సాధించారు. దీంతో ఆయనే విజేత అని ఇటీవల ప్రకటించారు. ఈ స్టేట్ లోని 20 ఎలెక్టోరల్ ఓట్లనూ గెలుచుకున్న అభ్యర్థే విజేత అవుతాడు. ఒకవేళ పెన్సిల్వేనియా కోర్టు తీర్పును ట్రంప్ తిరస్కరించినా కనీసం మరో రెండు రాష్ట్రాల్లో అయినా ఆయనకు అనుకూలంగా తీర్పులు వస్తాయన్న సూచనలు కనబడడం లేదు.
డిసెంబరు 8 లోగా ఎన్నికల వివాదాలన్నీ పరిష్కారం కావలసి ఉన్నాయి. కానీ పరిస్థితి మాత్రం అధ్యక్షుడు కానున్న జో బైడెన్ కి అనుకూలంగానే ఉంది. డిసెంబరు 14 న సమావేశమయ్యే ఎలెక్టోరల్ కాలేజీ బైడెన్ ని విజేతగా ప్రకటించిన తరువాతే తాను వైట్ హౌస్ ను వీడుతానని ట్రంప్ అంటున్నారు. కానీ ఆ తరువాత కూడా ఆయన ఏ చిక్కులు తెస్తాడో తెలియదు.