కరోనా వైరస్పై పరిశోధన చేస్తున్నవారు రోజుకో కొత్త విషయం చెప్పి గుబులు పుట్టిస్తున్నారు.. కరోనా బాధితులకు గాలి కాలుష్యం మరింత ముప్పు తెస్తుందని తాజా పరిశోధనలో తేలింది.. నైట్రోజన్ డయాక్సైడ్ వాయువును కరోనా రోగులు పీలిస్తే కనుక మరింత అస్వస్థతకు గురవుతారని పరిశోధన తేల్చింది.. జనవరి నుంచి జులై వరకు అమెరికాలోని దాదాపు 3,122 ప్రాంతాలలో గాలిలో ఉండే పార్టికల్ మీటర్, నైట్రోజన్ డయాక్సైడ్, ఓజోన్ స్థాయిలను సమీక్షించిన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చారు. పట్టణాలు, నగరాలలో ఉండే కాలుష్యం కరోనా తీవ్రతను మరింతగా పెంచుతున్నట్టు తేలింది. కోవిడ్ సోకిన వ్యక్తి మరణంలో నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు పాత్ర కీలకంగా ఉందట! నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలో గాలిలో 4.6 పార్ట్స్ పర్ బిలియన్ పెరుగుదల ఉంటే కోవిడ్ మరణాల శాతం కూడా 11కు పెరుగుతున్నదని కనిపెట్టారు. కోవిడ్ మరణాల రేటులో ఇది 16 శాతం. కాలుష్యంలో నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు 4.6 పీపీబీకి తగ్గించగలిగితే సుమారు 14,672 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలతో బయటపడే ఛాన్సుందని పరిశోధకులు చెబుతున్నారు. గాలికాలుష్యం వల్లనే కోవిడ్ బాధితులు తీవ్ర అస్వస్థతకు గురై మరణిస్తున్నారని చెబుతున్నారు. నైట్రోజన్ డయాక్సైడ్ వాయువు ఎక్కువ మోతాదులో ఉండే న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా, ఆరిజోనా రాష్ట్రాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.