పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు…తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ..మూడే ముళ్ళు.. ఏడే అడుగులు..మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ పెళ్లికి చక్కటి నిర్వచనమిచ్చారు మనసు కవి ఆత్రేయ! కరోనా కాలంలో వివాహ మండపాలలో ఆ మాత్రం సందడి కూడా లేకుండా పోయింది.. అయినా సరే.. కాస్త సందడిగానే పెళ్లి చేసుకోవాలనుకుంది లండన్లోని ఓ జంట… 250 మంది బంధుమిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్గా పెళ్లి కూడా చేసుకున్నారు.. బ్రిటన్లో నిబంధనలు అంత కఠినంగా ఉన్నప్పుడు వీరు అంత వైభవంగా ఎలా పెళ్లి చేసుకున్నారనే డౌట్ వస్తుంది కదూ! అది చెప్పే ముందు వధూవరులను ఇంట్రడ్యూస్ చేయాలి కదా! నూతన వరుడు రోమా పోపట్ లండన్లోని సౌత్గేట్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పని చేస్తున్నారు.. నూతన వధువు వినాల్ పటేల్ ఐటీ కన్సల్టెంట్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.. ఇద్దరికీ చెరో 30 ఏళ్ల వయసుంటుంది.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. మొన్న ఏప్రిల్లో ఒక ఇంటివారమవుదామనుకున్నారు.. కఠినమైన లాక్డౌన్ నిబంధనలు ఉండటంతో పెళ్లిని వాయిదా వేసుకున్నారు.. కరోనా వైరస్ నియంత్రణలోకి వస్తుందనుకుంటే అదేమో రోజురోజుకీ విజృంభిస్తోంది.. లాక్డౌన్ ఆంక్షలేమో సడలడం లేదు.. ఇలాగైతే కష్టమేననుకున్న వారిద్దరు కరోనా కాలంలోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అండన్ నిబంధనల ప్రకారం పెళ్లికి 15 మందికి మించి పిలవకూడదు. నిబంధనలు పాటిస్తూనే గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకోసం ఎస్సెక్స్లోని 500 ఎకరాల గ్రౌండ్ను పెళ్లి వేదికగా బ్రాక్స్లెడ్ పార్క్ను పెళ్లి పందిరిగా ఎంపిక చేసుకున్నారు. పెళ్లి వేడుకలకు రమ్మంటూ 20 మంది దగ్గర చుట్టాలకు.. ప్రాణ స్నేహితులకు ఆన్లైన్ ద్వారా ఆహ్వానం పంపారు. ముందు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడానికి నాప్కిన్స్ను, శానిటైజర్లను పంపించారు. పెళ్లి వేదిక దగ్గర పాటించాల్సిన జాగ్రత్తలను సూచించారు.. రుచికరమైన స్నాక్స్ను కూడా పంపారు.. మొన్న ఆదివారం అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.. వచ్చిన వారంతా ఖరీదైన కార్లలో వచ్చారు.. ఆ భారీ మైదానంలో నిర్దిష్ట దూరంలో కార్లను పార్క్ చేశారు.. కారులోంచి దిగకుండానే వివాహమహోత్సవాన్ని తిలకించారు. అక్కడక్కడ ఏర్పాటు చేసిన భారీ స్క్రీన్లలో పెళ్లి తంతు చక్కగా కనిపించింది.. పెళ్లి వారు సూచించిన ఫుడ్ వెబ్సైట్ నుంచి తమకు నచ్చిన ఫుడ్డును తమకు ఇష్టమైన హోటళ్ల నుంచి తెప్పించుకు తిన్నారు. పెళ్లి ముగిసిన తర్వాత కొత్త దంపతులు గోల్ఫ్ బగ్గీలో మైదానమంతా కలయతిరిగారు.. అతిథుల ఆశీర్వాదాలు, ఆశీస్సులు తీసుకున్నారు. హోటళ్ల నుంచి వచ్చిన ఫుడ్డు పార్సళ్లను వెయిటర్ల బృందం జాగ్రత్తగా విప్పి అతిథులకు అందించింది..అన్నట్టు పెళ్లి వేదికపై 15 మందికి మించి కుటుంబ సభ్యులు లేకుండా చూసుకున్నారు. మైదానాన్ని వాడుకున్నందుకుగాను బ్రాక్స్టెడ్ పార్క్కు పదిహేను లక్షలు చెల్లించుకున్నారు.. హోటళ్ల నుంచి వచ్చిన ఫుడ్కు ఎంత ఖర్చయ్యిందో తెలియదు.. ఇదో కొత్త ట్రెండ్.. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ గ్రాండ్గా ఎలా పెళ్లి చేసుకోవచ్చో పోపట్, పటేల్లు తెలిపారు. రాబోయే రోజుల్లో పెళ్లిళ్లన్నీ ఇలాగే జరుగుతాయేమో!