ఇండియాలో ప్రముఖ కార్ డిజైనర్ దిలీప్ చాబ్రియా, ఆయన కుమారుడు బోనిటో, సోదరి కాంచన్ కూడా కోట్లాది రూపాయల కార్ ఫైనాన్సింగ్ స్కామ్ లో నిందితులని ముంబై పోలీసులు తెలిపారు. వీరితో బాటు దిలీప్ ఆధ్వర్యం లోని డీసీడీపీఎల్ సంస్థకు చెందిన ఇద్దరు డైరెక్టర్లు కూడా నిందితులేనని వారు చెప్పారు. దిలీప్ నుఅరెస్టు చేసిన ఖాకీలు శనివారం ఇతడిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచగా ఇతని పోలీస్ కస్టడీని కోర్టు ఈ నెల 7 వరకు పొడిగించింది. ఓ ప్రముఖ క్రికెటర్ న, బాలీవుడ్ నటితో బాటు మరికొందరిని ఈయన ఛీట్ చేశాడని వెల్లడైంది. పూణే, గురు గ్రామ్ లో ఇతనికి కారు వర్క్ షాపులు ఉన్నాయి. ఈ కార్ డిజైనర్ కు చెందిన డీసీ అవంతి కార్లకు సంబంధించి 16 రిజిస్ట్రేషన్ నెంబర్లు ఒకే ఇంజన్ పై రిజిస్టర్ అయి ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. తమను ఈయన మోసగించినట్టు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఈయన కుమారుడు, సోదరి హస్తం కూడా ఈ స్కామ్ లో ఉన్నట్టు తేలడంతో పోలీసులు తమ దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు.