ఏపీలో రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ అంశంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దశలవారీగా 18 లక్షల ఆంధ్రా వ్యవసాయదారులు నోట్లో మట్టి కొట్టేందుకు ఏపీ సర్కారు జీవోలు తెస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలకు జగన్ ప్రభుత్వం గుడ్డిగా మద్దతు ఇస్తున్నదని ధ్వజమెత్తారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ కోసం మీటర్లు బిగించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయాల్సిన అగత్యం ఎందుకంటూ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం నేరుగా విద్యుత్ సంస్థలకు ఉచిత విద్యుత్ బిల్లులు చెల్లించకూడదా? అని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్ నుంచి తప్పుకునేందుకే నగదు బదిలీ కుట్ర జరుగుతోందని తెలిపారు. తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.