‘ఆ వీడియోను వక్రీకరించారు’, బీజేపీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మండిపాటు

| Edited By: Pardhasaradhi Peri

Jan 31, 2021 | 5:54 PM

వ్యవసాయ చట్టాలను తమ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమర్థిస్తున్నట్టుగా పోస్ట్ చేసిన ఓ వీడియో వక్రీకరించినదని  ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.

ఆ వీడియోను వక్రీకరించారు, బీజేపీపై ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా మండిపాటు
Follow us on

వ్యవసాయ చట్టాలను తమ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమర్థిస్తున్నట్టుగా పోస్ట్ చేసిన ఓ వీడియో వక్రీకరించినదని  ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధికార ప్రతినిధి సాంబిత్ పాత్రా ఓ వీడియోను రిలీజ్ చేశారని,  అందులో కేజ్రీవాల్..రైతు చట్టాలకు మద్దతు పలుకుతున్నట్టు ఉందన్నారు. కానీ ఇది కావాలని, వక్రీకరించి..ఎడిట్ చేసిన వీడియో అని ఆయన బీజేపీని దుయ్యబట్టారు. ఈ పార్టీయే కాదు, ప్రధాని మోదీ సైతం ప్రజల విశ్వనీయతను కోల్పోయారని ఆయన మండిపడ్డారు. అందుకే ఈ విధమైన వీడియోలను రిలీజ్ చేస్తున్నారని, కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసునని సిసోడియా వ్యాఖ్యానించారు. రైతులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న అన్నదాతలకు సంఘీభావం తెలుపుతున్నామని అరవింద్ కేజ్రీవాల్ చాలా సందర్భాల్లో ప్రకటించారు.

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ అసెంబ్లీ  లోగడ ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. గత ఏడాది డిసెంబరులో జరిగిన శాసన సభలో రైతు చట్టాల ప్రతులను  ఢిల్లీ సీఎం చించివేశారు. తాము ఎప్పుడూ రైతుల పక్షమే అన్నారు.