వివాదాస్పద రైతు చట్టాల కాపీలను ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ గురువారం అసెంబ్లీలో చించివేశారు. బ్రిటీషర్ల కన్నాఅధ్వానంగా మారవద్దని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల నిరసనలపై చర్చించేందుకు ప్రత్యేకంగా సమావేశమైన శాసన సభలో ఆయన తీవ్ర పదజాలంతో కేంద్రం మీద విరుచుకపడ్డారు. ఈ కోవిడ్ పాండమిక్ లో ఈ చట్టాలను ఇంత త్వరగా ఆమోదించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. అంతకు ముందు ఆప్ ఎమ్మెల్యేలు మహేంద్ర గోయల్, సోమనాథ్ భారతి తదితరులు రైతు చట్టాల కాపీలను చించివేస్తూ. వీటిని తాము ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. తాము రైతుల పక్షాన ఉంటామని, కేజ్రీవాల్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంటామని రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ అన్నారు. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం రూపొందించిన మూడు బిల్లులను ఆయన సభలో ప్రవేశపెట్టారు. పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రాల తరువాత, ఢిల్లీ కూడా అలాగే ఈ విధమైన బిల్లులను తెచ్చిన మూడో రాష్ట్రమైంది.
కాగా-సింఘు బోర్డర్ లో ధర్నా చేస్తున్న రైతులకు ఆప్ కార్యకర్తలు, మద్దతుదారులు మంచినీరు, ఆహారం ఇస్తున్నారు. ఇటీవల వారి ధర్నా స్థలాన్ని సందర్శించిన అరవింద్ కేజ్రీవాల్ ..తమ ప్రభుత్వం పూర్తిగా మీ పక్షాన ఉంటుందని ప్రకటించారు. అన్నదాతలు చేస్తున్న డిమాండ్లు సహేతుకమైనవని అన్నారు. అయితే ఇలా రైతు చట్టాల కాపీలను అసెంబ్లీలో చించివేసి ఆయన తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చాటుకున్నారు.
AAP MLAs @attorneybharti and @MohinderAAP tears copy of 3 Farm Bills.
“We refuse to accept these black laws which are against farmers.” pic.twitter.com/7s4puJNZPA
— AAP (@AamAadmiParty) December 17, 2020