భారత్-చైనా మధ్య మళ్ళీ ‘జగడం’ ! లడఖ్ ఉద్రిక్తం

| Edited By: Pardhasaradhi Peri

May 26, 2020 | 2:39 PM

భారత-చైనా మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. లడఖ్ తూర్పున పలు వివాదాస్పద భూభాగాల్లో ఉభయ దేశాల సైనికులూ ముఖాముఖీ తలపడేంతగా టెన్షన్ తలెత్తింది. లడఖ్ వాస్తవాధీన రేఖ పొడవునా ఇరు పక్షాల తుపాకులు గర్జించడానికి సిధ్దంగా ఉన్నాయని టాప్ సైనికవర్గాలు తెలిపాయి. 2017 లో డోక్లామ్ ఘర్షణ తరువాత తిరిగి తాజాగా దాదాపు అలాంటి పరిస్థితి ఏర్పడింది. లడఖ్ లోని పాంగాంగ్, గాల్వాన్ వ్యాలీలో ఇండియా తన దళాలను మరింతగా మోహరించిందని మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. […]

భారత్-చైనా మధ్య మళ్ళీ జగడం ! లడఖ్ ఉద్రిక్తం
Follow us on

భారత-చైనా మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నాయి. లడఖ్ తూర్పున పలు వివాదాస్పద భూభాగాల్లో ఉభయ దేశాల సైనికులూ ముఖాముఖీ తలపడేంతగా టెన్షన్ తలెత్తింది. లడఖ్ వాస్తవాధీన రేఖ పొడవునా ఇరు పక్షాల తుపాకులు గర్జించడానికి సిధ్దంగా ఉన్నాయని టాప్ సైనికవర్గాలు తెలిపాయి. 2017 లో డోక్లామ్ ఘర్షణ తరువాత తిరిగి తాజాగా దాదాపు అలాంటి పరిస్థితి ఏర్పడింది. లడఖ్ లోని పాంగాంగ్, గాల్వాన్ వ్యాలీలో ఇండియా తన దళాలను మరింతగా మోహరించిందని మిలిటరీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ప్రాంతాల్లో చైనా  రెండు వేల నుంచి రెండున్నర వేల సైనికులను దింపిందని, పైగా తాత్కాలిక శిబిరాల సంఖ్యను కూడా పెంచిందని తెలుస్తోంది. అయితే చైనా దళాలకన్నా మన సైనికులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్టు తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ సైనికాధికారి తెలిపారు.  గాల్వాన్ వ్యాలీలో దర్భుక్-షేక్, దౌలత్ బేగ్ ఓల్దీ రోడ్ సహా పలు కీలక ప్రాంతాల్లో చైనా దళాలు మోహరించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ‘ఇది చాలా సీరియస్ విషయం.. సాధారణ ట్రాన్స్-గ్రెషన్  ‘ కాదు’ అని నార్తర్న్ ఆర్మీ మాజీ కమాండర్ డీ.ఎస్.హుడా పేర్కొన్నారు.

ముఖ్యంగా గాల్వాన్ వంటి చోట్ల చైనా దళాల ఉనికి ఆందోళనకరం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో అసలు ఇప్పటివరకు ఉభయ దేశాల మధ్య వివాదమే లేదు. కానీ తాజాగా ఈ ఉద్రిక్తత తలెత్తింది. ఈ విధమైన వాతావరణాన్ని  తగ్గించేందుకు రెండు దేశాలూ దౌత్యపరమయిన చర్చలను, ప్రయత్నాలను ముమ్మరం చేయాలని ఉన్నత సైనిక వర్గాలు కోరుతున్నాయి.

గాల్వాన్ లోయలో డ్రాగన్ కంట్రీ గత రెండు వారాల్లో 100 గుడారాలు ఏర్పాటు చేసింది. పైగా బంకర్ల నిర్మాణం కోసం భారీగా సాధనాలను కూడా తెచ్చింది. ఈ నెల 5 న లడఖ్ లో, ఆ తరువాత 9 న నార్త్ సిక్కిం లో ఉభయ దేశాల సైనికులూ పరస్పరం ఘర్షణ పడిన సంగతి తెలిసిందే. ఆ ఘర్షణల్లో సుమారు వందమందికి పైగా గాయపడ్డారు. 2017 లో డోక్లామ్ ప్రాంతంలో భారత, చైనా దళాలు 73 రోజుల పాటు సాయుధ ఘర్షణలకు తలపడ్డాయి. ఆ సమయంలో రెండు దేశాల మధ్య వార్ జరగవచ్చునన్న ఆందోళన కూడా తలెత్తింది.