వంగినోడు వంగాడు.. మింగినోడు మింగాడు అన్నట్టే ఉంది మా పరిస్థితి అనడం రైతన్నకు అలవాటు. ఎవరు పాలించినా ఇదే మా తీరు అని ఏళ్లుగా రైతన్న బాధపడ్డం చూస్తున్నదే. ఇప్పుడిప్పుడే రైతన్న గోడు వెలుగులోకి వస్తోంది. ప్రభుత్వాలు రైతుల పాలిట ఏ మేరకు ఉద్దరణపనులు చేపట్టారో..నేతలే ప్రజల ముందుకు తేవడం ఆశావహపరిణామం. అయితే, తాజాగా రైతుల ఆత్మహత్యల గురించి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని పేర్కొన్నారు. ఆదివారం విజయవాడలో ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలపై చంద్రబాబు అండ్ కో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2019 వరకు అధిక సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయని తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 33 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారని మంత్రి వెల్లడించారు. రైతుల ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ చంద్రబాబుదేనన్న కన్నబాబు.. దేశంలో రైతులకు ఏ రాష్ట్రంలో ఇవ్వని పథకాలను ఏపీలో అమలు చేస్తున్నామని.. గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా రైతులకు పెట్టుబడి సహాయం చేస్తున్నట్లు తెలిపారు.