చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన వైరస్.. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. వైరస్ సోకిన కొన్ని రోజుల్లోనే మనిషి చనిపోతున్నాడు. అనేక దేశాలకు ఈ మహమ్మారి వ్యాపించింది. ఎన్నో దేశాలకు నిద్ర లేకుండా చేస్తున్న కరోనా వైరస్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త పేరు పెట్టింది. ఇకపై కరోనాను అధికారికంగా ‘కోవిడ్–19’గా పిలవనున్నారు. ఇందులో సీ అక్షరం కరోనాను, వీ అక్షరం వైరస్ను, డీ అక్షరం డిసీజ్ ను, 19ని.. వ్యాధిని కనుగొన్న 2019కి సూచనగా పెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా ‘కోవిడ్–19’ వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా మృతుల సంఖ్య వెయ్యి దాటింది. చైనాలో ఇప్పటివరకూ 1016 మంది చనిపోయారు. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో 42వేల 638 మందికి వైరస్ సోకింది. రోగుల సంఖ్య పెరుగుతుంటే… మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే 108 మంది చనిపోగా, 2వేల 478 మందికి అదనంగా ఈ వైరస్ సోకింది. తాజాగా యూఏఈలోని దుబాయిలో మరో భారతీయుడు కరోనా బారినపడ్డారు. ఇప్పటికే కేరళలో ముగ్గురికి కరోనా వైరస్ సోకగా… వారిలో ఒకరు కోలుకున్నారు.
కరోనా వైరస్ను నియంత్రించేందుకు కాస్తంత ఉపశమనం దొరికినట్లైంది. వాస్తవానికి ఈ వైరస్ని నివారించేందుకు ఇంతవరకూ మందును కనిపెట్టలేదు. కానీ, ఈ వైరస్ను నియంత్రించాలంటే స్వచ్ఛమైన గాలి, వెలుతురు ప్రసరించే ప్రదేశాల్లో కరోనా వైరస్ సోకిన రోగులను ఉంచితే.. ఆ వైరస్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటుగా ఏసీల వాడకం మానేసి.. ఫ్యాన్లను వాడాలని సూచిస్తున్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు.. చేతుల్ని ఎప్పటికప్పుడు సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కోవటం వల్ల కరోనా వైరస్ను నియంత్రించవచ్చంటున్నారు.
ఇదిలా ఉంటే, తెలంగాణలో కరోనా అనుమానితుల సంఖ్య 163కు చేరింది. గాంధీ, ఫీవర్, ఉస్మానియా ఆస్పత్రుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. కాగా, వీవీఐపీల కోసం గాంధీలో పెయిడ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. వార్డుల్లో ఉండేందుకు వీవీఐపీలు విముఖత చూపుతున్నారని, వారి కోసం ఏడో బ్లాక్లో వీఐపీలకు కరోనా టెస్టులు చేయనున్నట్లు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్ తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం కేటాయించిన ఫీజుల మేరకే వసూలు చేయనున్నట్లు చెప్పారు.. ప్రస్తుతం ఐదు బెడ్లతో వీఐపీ సౌకర్యం కల్పిస్తున్నట్లు డాక్టర్ శ్రవణ్ వివరించారు.