దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది తెలంగాణలో జరిగిన డాక్టర్ దిశ ఉద్దంతం. సామాన్య ప్రజానీకం మొదలు రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం దిశ ఘటనపై స్పందించారు. దిశ సంఘటనపై త్వరలోనే ఓ సినిమా కూడా రూపొందించబోతున్నారట. సామాజిక న్యాయం, ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్ వంటి అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టిసారిస్తూ..ఈ సినిమాను రూపొందిస్తున్నారట. ఇప్పటికే దానికి సంబంధించి కథ, స్క్రిప్టు రెడీ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఇంతకీ దిశను తెరమీదకు తెస్తున్నది ఎవరు..? అందులో నటించబోయే హీరో, హీరోయిన్లు ఎవరన్నది చెప్పలేదు కదా..! వివరాల్లోకి వెళితే..
నటసింహ నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందనున్న చిత్రం డిసెంబర్ 6న ప్రారంభమైంది. అదే రోజున దిశ నిందితుల ఎన్కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ, దిశ నిందితుల ఎన్కౌంటర్పై సీరియస్గా స్పందించారు. మరోమారు ఎవరూ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా, అసలు అటువంటి ఆలోచనే మొలకెత్తనివ్వకుండా అందరికీ ఇదొక గుణపాఠం కావాలంటూ బాలయ్య ఎంతో ఆవేశంతో ఊగిపోయారట. దాంతో ఈ చిత్రంలో ఇలాంటి ఓ ఎపిసోడ్ పెట్టాలని బోయపాటి కూడా ప్లాన్ చేస్తున్నాడన్నది సమాచారం.
అమ్మాయిలపై జరుగుతున్న దారుణలను బేస్ చేసుకునే గతంలోనూ బోయపాటి తన సినిమాల్లో చూపించారు. ఆ కోవలో వచ్చిన సింహా – లెజెండ్ సినిమాల్లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగుల కు థియేటర్ల లో అద్భుతమైన స్పందన వచ్చింది. సింహా సినిమా సమయంలో యాసిడ్ దాడి ఘటనకు సంబంధించిన ఎపిసోడ్ పెట్టాడు బోయపాటి. ఇక లెజెండ్లో అమ్మాయిలను పురిటిలోనే చంపే వారికి బుద్ధి చెప్పే సీన్ కూడా పెట్టాడు. ఇప్పుడు కూడా దిశ ఎపిసోడ్ ఒకటి ఈ చిత్రంలో ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదెంత వరకు నిజమనేది మాత్రం తెలియాల్సి ఉంది.