ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న జీరో ఎఫ్ఐఆర్ విధానం మహిళలకు భరోసా నిస్తోంది. మొన్నామధ్య కృష్ణా జిల్లా నందిగామ పరిధిలో మొట్టమొదటి జీరో ఎఫ్ఐఆర్ నమోదుకాగా, తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ బుక్చేసి కేసు నమోదు చేశారు. జిల్లాకు చెందిన ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తుండగా రిలీవింగ్ డ్రైవర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, తనను వేధిస్తూ..వికృత చేష్టలు చేసినట్లుగా బాధితురాలు పోలీసులకు తెలిపింది.
ఇదంతా జరుగుతుండగా తాను ఏమాత్రం భయపడకుండా డయల్ 100 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. నాలుగో టౌన్ పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతపురం తపోవనంలో బస్సును అడ్డుకుని ఆపేసిన పోలీసులు నిందితుడైన డ్రైవర్ నూర్ మహ్మద్ను అరెస్ట్ చేశారు. యువతిని అదే బస్సులో బెంగళూరుకు పంపించారు. ఏపీ పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడంపై బస్సులోని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా పోలీసులు బాధితులకు అండగా నిలబడుతుండటం చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.