ప్రతి పెట్టుబడిదారుడు పెట్టుబడి పెట్టిన వెంటనే తన డబ్బును రెట్టింపు అయిపోవాలని కోరుకుంటాడు. అందుకు అతను సాధ్యమైనంత ఉత్తమమైన పథకాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఈ ప్రక్రియలో అతను డబ్బును కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గ్యారెంటీతో డబ్బును రెట్టింపు చేయడమే కాకుండా, భద్రతకు హామీ ఇచ్చే పథకాలను ఎన్నుకోవడం ముఖ్యం. మనకు మార్కెట్లో అలాంటి చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే దానిని వెతికి పట్టుకోడానికి కొంచెం ఓపిక అవసరం. అటువంటి సురక్షిత పథకాలను పోస్టాఫీసు ప్రజలకు అందిస్తోంది. అలాంటి పథకాలలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. పెట్టుబడిదారులు ఈ పథకంలో పెట్టుబడి పెడితే సురక్షితమైన, హామీతో కూడిన రాబడిని అందిస్తుంది. ఈ పథకం ప్రస్తుతం 7.5% చొప్పున వార్షిక వడ్డీని అందిస్తోంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
భారత ప్రభుత్వం నిర్వహించే పథకాలలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఇది రైతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకం. ఈ పథకంలో, మీరు మీ డబ్బును నిర్ణీత వ్యవధిలో రెట్టింపు చేసుకోవచ్చు. కిసాన్ వికాస్ పత్ర యోజన దేశంలోని అన్ని పోస్టాఫీసులు, పెద్ద బ్యాంకులలో అందుబాటులో ఉంది. డబ్బును దీర్ఘకాలిక ప్రాతిపదికన ఆదా చేసుకోవచ్చు. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1000కాగా గరిష్ట పెట్టుబడిపై పరిమితి లేదు.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు సంవత్సరానికి 7.5 శాతం రాబడిని పొందుతారు. గత సంవత్సరం ఏప్రిల్ 2023లో, దాని వడ్డీ రేట్లు 7.2 శాతం నుంచి 7.5%కి పెంచారు. జనవరి 2023 నుంచి మార్చి 2023 వరకు, ఈ పథకంలో డబ్బు రెట్టింపు కావడానికి 120 నెలలు పట్టింది. కానీ దీని తర్వాత, మీ డబ్బు దాని కంటే ఐదు నెలల ముందుగా అంటే 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో రెట్టింపు అవుతుంది.
ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం, మీరు ఈ రోజు ఈ పథకంలో రూ. 5 లక్షలు పెట్టుబడి పెడితే, మీరు రాబోయే 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలల్లో 10 లక్షల రూపాయలను తిరిగి పొందుతారు. అంటే, మీరు వడ్డీ నుంచి నేరుగా 5 లక్షల రూపాయలు సంపాదిస్తారు. మీరు పథకంలో ఏకమొత్తంలో 4 లక్షలు పెట్టుబడి పెడితే, మీరు 115 నెలల్లో 8 లక్షలు తిరిగి పొందుతారు. మంచి విషయమేమిటంటే, మీరు ఈ పథకంలో చక్రవడ్డీ ప్రయోజనం కూడా పొందుతారు. అంటే, మీరు వడ్డీపై కూడా వడ్డీని పొందుతారు.
మీరు కేవలం 1000 రూపాయలతో కిసాన్ వికాస్ పత్రలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ప్రతి నెలా 100 రూపాయల గుణిజాలలో పెట్టుబడి పెట్టవచ్చు. పథకం కింద ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు. 3 పెద్దలు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఇందులో నామినీ సౌకర్యం కూడా ఉంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు వారి పేరు మీద కేవీపీ ఖాతాను తెరవవచ్చు. గార్డియన్లు మైనర్ లేదా మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తరపున ఖాతాను తెరిసే అవకాశం ఉంది. డిపాజిట్ చేసిన తేదీ నుంచి 2 సంవత్సరాల 6 నెలల తర్వాత మీరు ఖాతాను మూసివేయవచ్చు. ఖాతాదారు మరణించినప్పుడు లేదా జాయింట్ ఖాతాలో ఎవరైనా లేదా అందరు ఖాతాదారులు మరణించినప్పుడు మూసి వేయవచ్చు.ఈ ఖాతాను తాకట్టు పెట్టవచ్చు లేదా సెక్యూరిటీగా కూడా బదిలీ చేయవచ్చు. ఈ పథకంలో వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఐటీఆర్ సమయంలో అదర్ సోర్సెస్ నుంచి వచ్చిన ఆదాయంగా దీనిని పేర్కొనాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..