డబ్బులను పొదుపు చేసుకోవడానికి, భవిష్యత్తులో అధిక రాబడి పొందటానికి అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్లు, షేర్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ తదితర వాటిలో పెట్టుబడులు ఎక్కువగా పెడుతుంటారు. దీర్ఘకాలంలో వాటి నుంచి ఆదాయం ఎక్కువగా వస్తుంది. అలాగే సావరిన్ గోల్డ్ బాండ్లు (ఎస్జీబీ) కూడా మంచి రాబడి అందిస్తాయి. ఈ నేపథ్యంలో 2016 ఆగస్ట్ 5న జారీ చేసిన 2016 -17 సిరీస్ Iకు సంబంధించిన బాండ్లను ఆగస్టులో రీడిమ్ చేసుకోవచ్చు.
బంగారం ధర రోజురోజుకూ పెరిగిపోతోంది. దానిలో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఇది అత్యంత తెలివైన నిర్ణయం కూడా. సావరిన్ గోల్డ్ బాండ్లు అంటే భౌతిక బంగారం పెట్టుబడికి అనువైన ప్రత్యామ్నాయం. వీటిని ప్రభుత్వం జారీ చేస్తుంది. ఈ బాండ్లను కొనుగోలు చేసి, నిర్ణీత సమయంలో విక్రయించడం వల్ల అధిక లాభాలు పొందవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి ఆర్థిక సంవత్సరానికి సావరిన్ గోల్డ్ బాండ్ల జారీకి నోటీసు, అలాగే విముక్తి (రీడిమ్) తేదీలను విడుదల చేస్తుంది. సాధారణంగా ఎస్జీబీ కాలవ్యవధి ఎనిమిదేళ్లు (మెచ్యూరిటీ రీడిమ్) ఉంటుంది. అయితే జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్ల తర్వాత రీడిమ్ (అకాల రీడిమ్) చేయవచ్చు. అంటే ఈ విధానంలో మీరు బాండ్లను కొనుగోలు చేస్తారు, కాల వ్యవధి అనంతరం విక్రయిస్తారు. క్రయ విక్రయాలకు సంబంధించిన నగదు మీ ఖాతాలో జమ అవుతుంది. అంటే మీవద్ద భౌతికంగా బంగారం ఉండదు. కేవలం బాండ్ల రూపంలోనే ఉంచుకుంటారు.
ఇండియా బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (ఐబీజేఏ) నివేదిక ప్రకారం.. మునుపటి వారం (సోమవారం నుంచి శుక్రవారం వరకూ) 999 స్వచ్ఛత బంగారం ముగింపు ధర సాధారణ సగటు ఆధారంగా లెక్కిస్తారు. ఇది రూపాయలలో ఉంటుంది. సబ్స్క్రిప్షన్ పీరియడ్కు ముందు వారం దీన్ని నిర్ణయిస్తారు. బంగారు బాండ్ల జారీ ధర వాటి నామమాత్రపు విలువ కంటే గ్రాముకు రూ.50 తక్కువగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..