Vizianagaram Maharaja Hospital Incident: విజయనగరంలో మహారాజా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడి ఇద్దరు రోగులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ హరి జవహార్లాల్ స్పందించారు. చనిపోయిన ఇద్దరూ కూడా కొవిడ్ చికిత్స పొందుతున్నారని.. వారు చనిపోవడానికి ఆక్సిజన్ కొరత కారణం కాదని వైద్యులు తెలిపారన్నారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్రెజర్ సమస్య వచ్చిందని.. దీన్ని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని హరిజవహర్లాల్ తెలిపారు. అర్ధరాత్రి మూడు గంటల సమయంలో ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బందులు తెలెత్తాయని వెల్లడించారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఆసుపత్రిలో మొత్తం 290 మంది కొవిడ్ రోగులు ఉన్నారని తెలిపారు. వారిలో 25 మందికి ఐసీయూలో ఆక్సిజన్తో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అయితే.. ఈ రోజు బాధితులు చనిపోవడానికి ఆక్సిజన్ కొరత కారణం కాదని వైద్యులు తెలిపారన్నారు. మరణాలపై అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని మీడియాకు కలెక్టర్ సూచించారు.
మహారాజా ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టంచేశారు. విశాఖ, పైడిబీమవరం నుంచి ఆక్సిజన్ తెప్పిస్తున్నామన్నారు. ఐసీయూలో ఉన్న రోగులను రిఫరల్ ఆసుపత్రులకు తరలించాల్సి వస్తే దానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేశామని చెప్పారు. సీరియస్గా ఉన్న వారిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. ఇప్పటికే పునరుద్ధరణ చర్యలు చేపట్టామని వెల్లడించారు. కాగా.. మహారాజా ప్రత్వాసుపత్రిలో నిన్నటి నుంచి ఐదుగురు కరోనా బాధితులు చనిపోవడం అందరిని కలిచివేస్తోంది.
Also Read: