అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రాజధాని రైతులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు జనసేనాని పవన్కల్యాణ్. రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన..టీడీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే విచారించి చర్యలు తీసుకోవాలి గానీ..ఇలా రైతుల పొట్ట కొట్టడం మంచిది కాదన్నారు.
రైతులు భూములను ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప టీడీపీకి కాదన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఎంత దూరమైనా వెళ్తామన్నారు. రాజధాని విషయంలో అవసరమైతే ప్రధాని మోడీ, అమిత్షాలను కలుస్తామన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్ కూడా అంగీకరించారు. రైతుల్లో నెలకొన్న ఆందోళనపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు మంచి చేస్తారని సీఎంను చేస్తే..ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. గతంలో భూసేకరణను కూడా వ్యతిరేకించాం. ఇప్పడు రాజధాని మార్పును కూడా వ్యతిరేకిస్తున్నాం. రైతులకు జనసేన అండగా ఉంటుందని ప్రకటించారు.