కొత్తూరు తాడేపల్లిలోని గోసంరక్షణశాలలో ఆవుల మృతికి టాక్సిసిటీ కారణమని ప్రాథమిక విచారణలో తేలినట్లు పశుసంవర్థక శాఖ అడిషనల్ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. అయితే, టాక్సిసిటీ అంటే విష ప్రయోగం కాదని, విషతుల్యమైన పదార్థాలు కారణమని ఆయన చెప్పారు. పచ్చగడ్డిలో పాస్ఫరస్, నత్రజని శాతం ఎక్కువైనా టాక్సిసిటీ కారణమయ్యే అవకాశముంటుందని తెలిపారు. ఆవులపై విషప్రయోగం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే గోవుల శరీరంలో అనేక చోట్ల రక్తపుచారలు కనబడ్డాయి తెలిపారు. మృతిచెందిన ఆవుల పోస్టుమార్టం నివేదిక మంగళవారం వస్తుందని, వారంలోపు ఫోరెన్సిక్ నివేదిక కూడా రానుందని దామోదర్ నాయుడు వెల్లడించారు. కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలోని దాదాపు 80కి పైగా గోమాతలు ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.
ఆవుల మరణంపై పోలీసులు తమ విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనపై గోశాల నిర్వాహకులు చెప్తున్న విషయాలపై పోలీసులు సంతృప్తి చెందడం లేదు. దీని వెనుక వాస్తవాలు వెలికితీసేందుకు రహస్య విచారణ చేపట్టారు. ఆవులు మృతి చెందిన ఘటనపై విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్లో శనివారం కేసు నమోదు అయిన విషయం విదితమే.