ప్రభుత్వాసుపత్రులు అంటే..పేద ప్రజల ప్రాణాలను కాపాడే ఆలయాలు అంటారు. అక్కడి వైద్యులు రోగుల పట్ల దేవుళ్లుగా భావిస్తారు. కానీ, పవిత్రమైన వైద్య వృత్తిని నిర్లక్ష్యం చేస్తూ..కొందరు డాక్టర్లు డ్యూటీ టైమ్లో హాయిగా ఆటపాటలతో ఎంజాయ్ చేశారు. వైద్య సేవలను గాలికి వదిలేసి..ఆస్పత్రి ప్రాంగణంలోనే ఆటలు మొదలు పెట్టారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో రోగులు అవస్థలు పడక తప్పలేదు.
నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
పీహెచ్సీలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు వైద్యాధికారులు సెలవుపై వెళ్లడంతో రోగులకు సేవలందించాల్సిన జూనియర్ డాక్టర్లు..బంతి ఆట ఆడుతూ కేరింతలు కొట్టారు. తమకు అడ్డు చెప్పే వారు లేరని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఖాళీ స్థలంలోనే ఏకంగా బంతాట ఆడారు.
ఉదయం 10 గంటల నుంచి విధులు నిర్వహించాల్సిన వారు.. రోగులను పట్టించుకోకుండా ఆటలాడారు. వారిని గమనించిన రోగుల బంధువులు కొందరు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఈ వార్త ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేని వారు… సర్కారు దవాఖానకు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అయితే, ఉన్నత చదువులు చదివి… పలువురికి మార్గదర్శకంగా ఉండాల్సిన జూనియర్ డాక్టర్లు.. రోగుల గోడు పట్టించుకోకుండా ఆటలాడుతూ కాలక్షేపం చేయటం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.. పీహెచ్సీ వైద్యులు… సిబ్బందిపై రోగులు.. వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.