వీణ పలుకుల కాణాచి బొబ్బిలి!

| Edited By: Ram Naramaneni

Sep 21, 2019 | 4:46 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో బొబ్బిలిది అత్యంత ప్రత్యేకత. ఇక్కడ వెలసిన సంతాన వేణుగోపాలస్వామి ఆలయం మరింత ప్రఖ్యాతి. సంతానం లేనివారు ఈ స్వామివారిని దర్శించుకుంటే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక బొబ్బిలికి మరో గుర్తింపును తెచ్చిపెట్టింది వీణ. వీణల తయారీకి పెట్టింది పేరు బొబ్బిలి..జియోగ్రాఫికల్ గుర్తింపు లభించిన బొబ్బిలి వీణల కున్న పేరు, ప్రఖ్యాతి  మరే వీణలకు లేదనే చెప్తారు. నాడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బొబ్బిలి వీణను చూసి మురిసి, […]

వీణ పలుకుల కాణాచి బొబ్బిలి!
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో బొబ్బిలిది అత్యంత ప్రత్యేకత. ఇక్కడ వెలసిన సంతాన వేణుగోపాలస్వామి ఆలయం మరింత ప్రఖ్యాతి. సంతానం లేనివారు ఈ స్వామివారిని దర్శించుకుంటే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక బొబ్బిలికి మరో గుర్తింపును తెచ్చిపెట్టింది వీణ. వీణల తయారీకి పెట్టింది పేరు బొబ్బిలి..జియోగ్రాఫికల్ గుర్తింపు లభించిన బొబ్బిలి వీణల కున్న పేరు, ప్రఖ్యాతి  మరే వీణలకు లేదనే చెప్తారు. నాడు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ బొబ్బిలి వీణను చూసి మురిసి, అవి తయారు చేసే సర్వ సిద్ధి వెంకటరమణను వైట్ హౌస్‌కు ఆహ్వానించారట. ఇక ఇక్కడ తయారైన వీణలకు మరో ప్రత్యేకత కూడా ఉంది…మైసూర్, తంజావురు వీణలు 3 చెక్కలతో తయారు చేస్తే.. బొబ్బిలి వడ్రంగులు ఒకే చెక్కతో అంటే ఏకాండీ కొయ్యతో వీణలు తయారు చేయడంలో సిద్ధహస్తులు.
విజయనగరం జిల్లా బొబ్బిలికి అతి సమీపంలోని గొల్లపల్లి అనే కుగ్రామం వీణలకు పుట్టినిల్లు. గత మూడొందల సంవత్సరాలుగా ఇక్కడ వీణలు తయారు చేస్తున్నారు. పూర్వం బొబ్బిలి సంస్థానాధీశులు మైసూరును సందర్శించిన సమయంలో… అక్కడ రాజ దర్బారులో వీణా కచేరీని తిలకించారు. కళలలకు ప్రాణం పెట్టే బొబ్బిలి రాజులకు కచేరీలో వీణా మాధుర్యంతో పాటు ఆ వీణలు తయారుచేసిన వడ్రంగుల నైపుణ్యం ఎంతో ఆకర్షించింది. వెనువెంటనే వాటిని బొబ్బిలిలో తయారు చేయించాలని వారు సంకల్పించారు. వీణల తయారీలో మెలకువలు నేర్చుకోవాలని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వడ్రంగులను మైసూరు పంపించారు. అలా మైసూరులో మెలకువలు నేర్చుకున్న వడ్రంగుల వంశీయులు నేటికీ బొబ్బిలిలో వీణలు తయారుచేస్తున్నారు. సంగీత వాయిద్యాలను పలికించే వీణలతో పాటు అందరి మనసులను హత్తుకునే చిన్నచిన్న వీణలను తయారు చేయడం వారి ప్రత్యేకత. ఆ చిన్నచిన్న జ్ఞాపికలే నేడు ప్రపంచ నలుమూలకు సరఫరా అవుతున్నాయి. బొబ్బిలి చరిత్రను ఖండాంతరాల్లో ప్రాచుర్యం పొందేలా చేస్తున్నాయి.
తెలుగు వారికీ, తెలుగు నేలకు గర్వకారణం బొబ్బిలి వీణ. సుస్వరాలు పండించే బొబ్బిలి వీణకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. దేశ, విదేశాల్లో బొబ్బిలి వీణ రాగాలు విన్పిస్తూనే ఉన్నాయి. ఎంతో మంది ప్రముఖుల కితాబులు పొందిన బొబ్బిలి వీణకు మరో గుర్తింపు దక్కింది. అయిదో తరగతి ఆంగ్ల పాఠ్య పుస్తకంలో బొబ్బిలి వీణ చరిత్రను పాఠ్యాంశంగా ముద్రించారు. దీంతో వీణ ఖ్యాతి మరింతగా వెలగనుంది. సంగీత వాయిద్య పరికరాల్లో ఉన్నతమైన వీణకు ఎంత ప్రాచుర్యం ఉంది? వీణల తయారీకి బొబ్బిలి గొల్లపల్లి ఎందుకు ప్రసిద్ధి చెందింది? వీణ చరిత్ర, నేపథ్యం వంటి అంశాలను పాఠ్య పుస్తకంలో ముద్రించారు. బొబ్బిలి సంస్థానాధీశుల కాలంనుంచే ఇక్కడ వీణ తయారీ ఉండేదని ఈ పాఠ్యాంశంలో పొందుపరిచారు.


సర్వసిద్ధి కటుంబీకులు ఐదు తరాలుగా వీణల తయారీని వృత్తిగా కొనసాగిస్తున్నారు. 1959లో బొబ్బిలి కోటలో శారద వీణల తయారీ సొసైటీ ఏర్పాటు చేశారు. సర్వసిద్ధ కుటుంబీకుల కోరిక మేరకు ప్రభుత్వం హ్యాండీక్రాఫ్ట్‌ కేంద్ర భవన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి భవనం ఏర్పాటు చేసింది. 2002 ఆగస్టు 28 నుంచి ఆ కేంద్రంలోనే వీణల తయారీ పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం సర్వసిద్ధి అచ్యుత్‌ నారాయణ వీణ సొసైటీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. వీణలు తయారుచేస్తున్న కళాకారులకు ప్రభుత్వం నుంచి మరింత ప్రోత్సాహం అందించాలని వారు కోరుతున్నారు. వీణల తయారీ కళాకారులకు క్వార్టర్స్‌ నిర్మించాలని, వీణల తయారీకి కావాల్సిన పనస కర్రను ప్రభుత్వమే సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.