బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటున్న బీజేపీ

| Edited By: Sanjay Kasula

Sep 24, 2020 | 1:31 PM

పశ్చిమ బెంగాల్‌ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరారు.. మమతా బెనర్జీ పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు.. సుపరిపాలన అందించే సామర్థ్యం తృణమూల్‌ కాంగ్రెస్‌కు లేదన్నారు.

బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటున్న బీజేపీ
Follow us on

పశ్చిమ బెంగాల్‌ భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరారు.. మమతా బెనర్జీ పాలన పూర్తిగా గాడి తప్పిందని విమర్శించారు.. సుపరిపాలన అందించే సామర్థ్యం తృణమూల్‌ కాంగ్రెస్‌కు లేదన్నారు. ప్రజలకు రక్షణ కొరవడిందని మండిపడ్డారు.. శాంతియుత వాతావరణమే లేదన్నారు.. అంతేనా… శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయి కాబట్టి తక్షణమే జోక్యం చేసుకోవలసిందిగా కేంద్ర హోమ్‌మంత్రి అమిత్‌షాకు ఓ లేఖ రాశారు.. ఈ మధ్యనే ఆరుగురు ఆల్‌ఖైదా తీవ్రవాదులను అదుపులో తీసుకున్న సంగతిని ఆ లేఖలో ప్రస్తావించారు.. మిద్నిపూర్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దిలీప్‌ఘోష్‌ రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఉగ్రవాదులకు బెంగాల్‌ ఒక అడ్డాగా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలనలో చీకటిశక్తులు పెట్రేగిపోతున్నాయని, అక్రమ ఆయుధాల తయారీకి కేంద్ర బిందువుగా రాష్ట్రం మారిందని అమిత్‌షాకు రాసిన లేఖలో విన్నవించుకున్నారు దిలీప్‌ ఘోష్‌. బెంగాల్‌లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందన్నారు.

బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.. బెంగాల్‌లో పాగా వేయాలన్నది బీజేపీ లక్ష్యం.. ఆ దిశగా అడుగులు వేస్తున్నది.. 2019 ఎన్నికల్లో 42 లోక్‌సభ స్థానాలలో బీజేపీ ఏకంగా 18 స్థానాలను గెల్చుకుని తృణమూల్‌కు గట్టి సందేశమే ఇచ్చింది.. 2014 ఎన్నికల్లో కేవలం రెండు లోక్‌సభ సీట్లను గెల్చుకున్న బీజేపీ అయిదేళ్లలోనే తన బలాన్ని అమితంగా పెంచుకోగలిగింది. వచ్చే ఏడాది బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.. అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్‌ వర్క్‌ను మొదలు పెట్టింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం..