శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ ఛానెల్ కాంక్రీట్ పనులు, సరికొత్త అంకానికి శ్రీకారం చుట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ
పోలవరం ప్రాజెక్ట్లో మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. స్పిల్ ఛానెల్ కాంక్రీట్ పనులు బుధవారం మొదలయ్యాయి. పూజలు చేసి..
పోలవరం ప్రాజెక్ట్లో మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. స్పిల్ ఛానెల్ కాంక్రీట్ పనులు బుధవారం మొదలయ్యాయి. పూజలు చేసి కాంక్రీట్ పనులను ప్రారంభించారు అధికారులు. 2020 జూలైలో వచ్చిన వరదలకు స్పిల్ ఛానెల్లో మట్టి పనులు, కాంక్రీట్ పనులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీఎంసీల నీరు అక్కడ నిలిచింది. నవంబర్ నుంచి నీటిని తోడే పనులు కొనసాగాయి. 70 భారీ పంపులతో నీటిని తోడింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. రెండున్నర టీఎంసీల నీటిని గోదావరిలోకి తోడి పోసింది. ఇప్పుడు అక్కడే మట్టి తవ్వకం, కాంక్రీట్ పనులను మొదలు పెట్టింది. స్పిల్ ఛానల్లో మట్టి తవ్వకం, అంతర్గత రహదారుల నిర్మాణ పనులు కూడా మొదలయ్యాయి. ఇప్పటి వరకు లక్షా పది వేల 33 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగింది. పది లక్షల 64 వేల 417 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులను ఈ ఏడాది జూన్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జలవనరుల శాఖ AEE పద్మకుమార్, DEE దామోదరం, మేఘా ఇంజనీరింగ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మత్తి అలగన్, అసిస్టెంట్ మేనేజర్ చంద్రమోహన్ , సీనియర్ ఇంజనీర్ అంకమ్మరావు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.