08 March 2025
Subhash
భారత రైల్వేలు మార్చి 31 నాటికి దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశాన్ని జర్మనీ, ఫ్రాన్స్, చైనా, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాలతో పాటు గ్రీన్ మొబిలిటీ దేశాల సరసన చేరుస్తుంది.
రైల్వే మంత్రిత్వ శాఖ 2023-24లో 35 హైడ్రోజన్ ఇంధన సెల్ ఆధారిత రైళ్ల సముదాయాన్ని అభివృద్ధి చేయడానికి రూ.2,800 కోట్లు కేటాయించింది.
ఈ రైళ్లకు సంబంధించిన స్పెసిఫికేషన్లను రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ అభివృద్ధి చేసిందని, ఈ సాంకేతికత పూర్తిగా భారతదేశంలోనే తయారైందని చెప్పారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఈ రైలును నిర్మిస్తోంది. ఉత్తర రైల్వేకు సంబంధించిన ఢిల్లీ డివిజన్ ద్వారా జింద్-సోనిపట్ మార్గంలో దాదాపు 89 కి.మీ.ల దూరం నడుస్తుంది.
ఇది ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలుగా ఉండనుంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక శక్తితో నడిచే హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా కూడా ఉండనుందన్నారు మంత్రి.
ఈ హైడ్రోజన్ రైలు అద్భుతమైన 1,200 హార్స్పవర్తో నడుస్తుంది. ఇతర దేశాలలో నడుస్తున్న ఇలాంటి హైడ్రోజన్ రైళ్ల బలం కంటే రెట్టింపు కంటే ఎక్కువ.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైడ్రోజన్-శక్తితో నడిచే రైళ్లలో చాలా వరకు 500 నుంచి 600 హెచ్పీ మధ్య సామర్థ్యం కలిగిన ఇంజిన్లను కలిగి ఉంటాయి.