07 March 2025
Subhash
లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla) భారత్లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. తన తొలి షోరూమ్ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఏర్పాటు చేయనుంది.
ఇందుకోసం ముంబై నడిబొడ్డున బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని అద్దెకు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
సీఆర్ఈ మ్యాట్రిక్స్ వివరాల ప్రకారం.. పార్కింగ్ సౌకర్యాలుగల ఈ షోరూమ్ స్పేస్కుగాను కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించనున్నారు.
అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్కు దగ్గరగా ఉంటుంది.
రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్గా కూడా టెస్లా జమ చేసింది.
ఇక భారత్లో తొలి రెండు షోరూమ్లను ఏర్పాటుకు దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాలను సంస్థ ఎంపిక చేసింది.
ఈ నేపథ్యంలో ఈ షోరూమ్లలో సర్వీస్ టెక్నీషియన్, సలహదారు పోస్టులు వంటి వాటికి ఢిల్లీ, ముంబై నగరాల్లో నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది.
మిగిలిన పోస్టులకు ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు టెస్లా ఒక ప్రకటనలో పేర్కొంది.