అక్కడ అంత్యక్రియలకు రూ. 30 లక్షలు.. అనాధశవాల్లా వదిలేస్తున్న ప్రజలు

TV9 Telugu

21 May 2024

కెనడాలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చనిపోయిన కుటుంబ సభ్యుల అంత్యక్రియలు కూడా నిర్వహించలేక అనాథ శవాల్లా వాటిని వదిలేస్తున్నారు.

అక్కడ చనిపోయిన వారి కోసం అవుతున్న అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ. 30 లక్షలు దాటుతుండడమే అందుకు కారణమని తెలుస్తోంది.

అంత సొమ్ము చెల్లించడం తమ వల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వదిలేస్తున్నారు కెనడా ప్రజలు.

దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పెరుగుతోంది. దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించారు

పదేళ్లు తిరిగేసరికి అంటే 2023కి ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తిస్తున్నారు.

అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. కెనడాలో అంత్యక్రియలకు సగటున 30 వేల డాలర్లకు పైనే అవుతోంది.

గ్రేటర్ టొరొంటోలో అయితే ఇది 34 వేల డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీలో ఇది దాదాపు రూ. 27 లక్షలు. ఇది ఒక్క అంత్యక్రియల నిర్వహణ ఖర్చు మాత్రమే.

ఇతర ఖర్చులు కూడా కలుపుకుంటే రూ. 30 లక్షలు దాటేస్తోంది. ఇంత ఖర్చును భరించలేని కుటుంబాలు తమవారి మృతదేహాలను అనాథల్లా వదిలిపెట్టేస్తున్నాయి.