సూర్యుడిపై పరిశోధనకు ఆపరేషన్‌ ఆదిత్య

31 August 2023

చంద్రయాన్‌ 3తో అంతరిక్షంలో విజయకేతనం ఎగరేసిన భారత్‌ మరో భారీ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు చేయని తొలి ప్రయోగాన్ని సెప్టెంబర్‌ 2న చేపట్టనుంది.

చంద్రుడి అధ్యయాన్ని మొదలుపెట్టిన భారతదేశం ఇప్పుడు సూర్యుడి అధ్యయానికి శ్రీకారం చుట్టింది.   భారతదేశపు మొట్టమొదటి సోలార్‌ మిషన్‌ ఆదిత్య L1కు ముహుర్తం ఖరారైంది. 

సెప్టెంబర్‌ 2న ఉదయం 11 గంటల 50 నిమిషాలకు శ్రీహరికోట షార్‌ సెంటర్‌ నుంచి ఈ ప్రయోగం చేపడతామని ఇస్రో ప్రకటించింది.

సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్‌ చేపడుతున్న తొలి అంతరిక్ష ఆధారిత పరిశోధనా కేంద్రంగా ఆదిత్య L1 నిలవనుంది. 

భూమి నుంచి దాదాపు లక్షన్నర కిలోమీటర్ల దూరంలో దీన్ని నిలిపి ఉంచుతారు. మిషన్‌ ఆదిత్య ద్వారా సూర్యుడికి సమీపంలోని L1 పాయింట్‌లో ఒక ఉపగ్రహాన్ని ఇస్రో అమర్చబోతోంది.

సూర్యుడికి సంబంధించిన ఉష్ణం, కరోనా ద్రవ్యరాశి, జ్వలన కార్యకలాపాలు, మంటలు, వాటి లక్షణాలు, క్షణక్షణం మారుతూ ఉండే అంతరిక్ష వాతావరణాన్ని ఆదిత్య L1 పేలోడ్స్‌ పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నాయి. 

పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ PSLV-XL ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఈ వాహకనౌక ఇప్పటికే శ్రీహరికోట షార్‌ సెంటరుకు చేరుకుంది.