రాములోరి గుడిలో మోగించగానే ఓంకార నాదం వినిపించే గంట 

18 December 2023.

ఆధ్యాత్మిక శోభ విరాజిల్లే రామాలయంలో అణువంతయినా తమ పాత్ర ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. పూజా సామగ్రిని సమర్పించే అదృష్టం బెంగుళూరుకు చెందిన భక్తుడికి దక్కింది.  

జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ట ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా, 130 దేశాల ప్రతినిధులు, వేలాది మంది సాధువుల సమక్షంలో జరగబోతోంది. 

 రాముడి గుడిలో స్వామివారి సన్నిధిలో ఉపయోగించే పూజా సామగ్రి.. ఉద్ధరిణి, హారతి పళ్లెం, కలశం చెంబు, అక్షతల ప్లేట తయారీ పునీతమైన రీతిలో జరుగుతోంది.

ఆలయ ఆవరణలో అమర్చే 42 గంటల్ని స్వామివారికి సమర్పించే భాగ్యం.. బెంగుళూరుకు చెందిన వ్యాపారి రాజేంద్ర నాయుడికి దక్కింది.

ఏడు తరాలుగా ఈ వృత్తిలో ఉన్న  తమిళనాడులోని నామక్కల్‌లో  ఆండాళ్ మౌల్డింగ్ వర్క్స్‌ని ఆశ్రయించి ఐదు నెలల కిందట నమూనాల్ని సమర్పించారు. 

గంటల తయారీకి అవసరమైన ముడి లోహం వెండి, రాగి, కాంస్యం అందజేశారు. 12 వందల కిలోల బరువైన 48 గంటల తయారీకి 45 రోజులు పట్టింది.

గంటల బరువు ఒక్కొక్కటి 25 నుంచి 120 కిలోలు. ఈ గంటలకున్న మరో విశిష్టత ఏమిటంటే.. మోగించగానే ఓంకార నాదం వినిపించడం.  

బెంగళూరులో భక్తుల సమక్షంలో ఆగమశాస్త్రం ప్రకారం ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి.. ఈ ఘంటికల్ని బెంగళూరు నుంచి అయోధ్యకు తరలిస్తున్నారు.

 స్వామివారి పూజా సామగ్రిని అందించే అదృష్టం తనకే దక్కడం పూర్వజన్మ సుకృతం అంటున్నారు భక్తుడు రాజేంద్ర నాయుడు.