17 September 2023

మహారాష్ట్రలో రెండు జిల్లాల పేర్లు మారయ్..

మహారాష్ట్రాలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను మార్చారు. ఔరంగాబాద్ జిల్లాను ఛత్రపతి శంభాజీనగర్‌, ఉస్మానాబాద్ జిల్లాను ధారాశివ్‌గా మార్చారు.

రెండు జిల్లాల పేర్లను మార్చినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు జిల్లాలు మరాఠ్వాడా ప్రాంతంలో ఉన్నాయి. 

ప్రజల నుంచి అందిన సూచనలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని పేరు మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర సర్కారు తెలిపింది. 

ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లను మార్చుతూ గత ఏడాది జూన్ 29న సీఎం పదవికి రాజీనామా చేయడానికి ఒక్కరోజు ముందు ఉద్ధవ్ థాకరే ఆదేశాలు జారీ చేశారు.

అయితే గవర్నర్ బలపరీక్షకు ఆదేశించిన తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం చెల్లుబాటు కాదంటూ ఉద్ధవ్ థాకరే నిర్ణయాన్ని ఏక్‌నాథ్ షిండే రద్దు చేశారు.

ఈ విషయంలో ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన వర్గానికి, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గాల మధ్య రాజకీయ వివాదం నెలకొంది. 

ఈ నేపథ్యంలో రెండు జిల్లాల పేర్లను మార్చుతూ ఇప్పుడు సీఎం ఏక్‌నాథ్ షిండే అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.