తెలుగు రాష్ట్రాల ప్రజలకు షాక్.. పెరుగుతున్న బియ్యం ధరలు..

03 January 2024

TV9 Telugu

తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు షాక్‌కు గురిచేస్తున్నాయి. మార్కెట్లో రోజురోజుకూ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల మార్కెట్లో సన్న బియ్యం ధర ప్రతి నెలా సగటున క్వింటాకు రూ.200 నుంచి రూ.300 పెరుగుతూ ఉన్నాయి.

ప్రస్తుతం మార్కెట్‌లో మేలు రకం పాత సన్న బియ్యం రూ.6,500 వరకు పలుకుతున్నాయి. ఇదే అదనుగా బ్రోకర్లు రెచ్చిపోతున్నారు.

రైస్‌ మిల్లుల లో ధరకు అదనంగా కిలోకు రూ.5 నుంచి రూ.8 వరకు పెంచి విక్రయిస్తున్నారు. మార్కెట్‌లో 25 కిలోల పాత బియ్యం బస్తా రూ.1,500కు పైమాటే.

గతేడాది సన్న బియ్యం ధర క్వింటాకు రూ.3 వేల నుంచి రూ.3500 వరకు ఉండేది. పాతబియ్యం అయితే 4200 వరకూ పలికేది.

కానీ ఇప్పుడు 25శాతం పెరిగి 6000 నుంచి 6500 వరకు పలుకుంది. కొన్ని బ్రాండ్ల పేరుతో ఉన్న సూపర్‌ ఫైన్‌ రైస్‌ కిలో రూ.70 వరకు అమ్ముతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వరి సాగు గతంతో పొలిస్తే బాగా తగ్గింది. కొన్ని జిల్లాల్లో సన్నారకం వరి సాగు ఎక్కువగానే ఉన్నప్పటికీ... ఆయా జిల్లాలోను బియ్యం రేట్లు తగ్గడం లేదు.

కర్నూలు రకం, జీలకర్ర సోనా మసూరి పేరుతో క్వింటాకు రూ.6500 పైగా వసూలు చేస్తున్నారు. నెలనెల పెంచుకుంటూ పోతూ ఆందోళనకు గురి చేస్తున్నారు.

వర్షాభావ పరిస్థితుల వల్ల కృష్ణా బేసిన్‌లో నీరు లేక వరి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో మిల్లర్లు, రిటైల్‌ వ్యాపారులు కలిసి కొనుగోలుదారుల జేబులను గుల్ల చేస్తున్నారు.