మరోసారి భారత జట్టుకు కెప్టెన్‌గా మారిన సచిన్.. మ్యాచ్‌లు ఎప్పుడంటే?

TV9 Telugu

17 January 2025

సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉండవచ్చు. కానీ, అతని అభిమానుల కోసం అప్పుడప్పుడు మళ్లీ యాక్షన్‌లోకి రానున్నాడు.

గత కొన్నేళ్లుగా రెండు మూడు పర్యాయాలు లెజెండ్స్ లీగ్ వంటి టోర్నీల్లో ఆడిన మాస్టర్ బ్లాస్టర్ మరోసారి మైదానంలోకి వస్తున్నాడు.

ప్రపంచ క్రికెట్‌లోని గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సచిన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో ఆడబోతున్నాడు.

మాజీ ఆటగాళ్లతో కూడిన ఈ కొత్త లీగ్‌లో సచిన్ భారత జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఈ లీగ్ భారతదేశంలో ఫిబ్రవరి 22 నుంచి మార్చి 16 వరకు జరుగుతుంది.

ఈ లీగ్‌కి భారత మాజీ కెప్టెన్, మరో గొప్ప బ్యాట్స్‌మెన్ సునీల్ గవాస్కర్ కమిషనర్‌గా నియమితులయ్యారు.

నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం, రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియం, రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలలో టోర్నీ మ్యాచ్‌లు జరుగుతాయి.

ఇందులో భారత్‌తో పాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ కూడా ఆడనుండగా, బ్రియాన్ లారా, జాక్వెస్ కలిస్, షేన్ వాట్సన్, కుమార సంగక్కర వంటి దిగ్గజాలు ఇందులో పాల్గొంటారు.