ప్యాసింజర్ రైలుకు 24 కోచ్‌లే ఎందుకుంటాయో తెల్సా.?

Ravi Kiran

17 July 2024

ప్రపంచంలో అతిపెద్ద ట్రాన్స్‌పోర్ట్‌ వ్యవస్థల్లో ఒకటైన ఇండియన్ రైల్వే ద్వారా ప్రతీ రోజూ లక్షల సంఖ్యలో ప్రయాణికులు తమ గమ్య స్థానాలను చేరుకుంటున్నారు. 

ప్రయాణికులు మొదలు, గూడ్స్‌ వరకు ఎన్నో సేవలను ఇండియన్‌ రైల్వేస్‌ అందిస్తున్నాయి. మరి ఇంతటి పెద్ద నెట్‌వర్క్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం.  

ఓ ప్యాసింజర్‌ రైలుకు 24 కోచ్‌లు ఉంటాయి. మరి ప్యాసింజర్‌ రైలుకు అస్సలు 24 కోచ్‌లు ఎందుకుంటాయో మీకు తెల్సా.? 

సాధారణంగా ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు వాటిలో ఒక రైలు కచ్చితంగా కొద్దిసేపు మరో ట్రాక్‌పై ఆగాల్సి ఉంటుంది. వేగంగా వెళ్లే రైలు దాటి వెళ్లిన తర్వాత మరొక రైలుకు మార్గం ఇస్తారు. 

అప్పటి వరకు మొదటి రైలు వేచి ఉండే ట్రాక్‌ను లూప్‌ లైన్‌గా పిలుస్తారు. ఏ ప్యాసింజర్‌ రైలు అయిన లూప్‌ లైన్‌ కంటే పెద్దగా ఉండకూడదు. 

ఒకవేళ లూప్‌ లైన్‌ దాటి రైలు కోచ్‌లు బయటకు వస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్యాసింజర్‌ రైలులో 24 కంటే ఎక్కువ కోచ్‌లు ఉండవు.

ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వేగంగా వెళ్తాయి కాబట్టి అవి క్రాస్‌ చేసేంత సేపు ప్యాసింజర్‌ రైళ్లను లూప్‌ లైన్‌లో ఉంచుతారు. 

రైల్వే నిబంధనల ప్రకారం లూప్‌ లైన్‌ పొడవు 650 నుంచి 750 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది సరిగ్గా 24 కోచ్‌లకు సరిపోతుంది. 

ఇక రైలులోని అన్ని కోచ్‌లు ప్లాట్‌ ఫామ్‌పై సులభంగా చేరుకోవడానికి వీలుగా ప్లాట్‌ఫామ్‌ కంటే రైలు పొడవు ఉండకూడదు. అందుకే రైలుకు 24 కోచ్‌లను ఏర్పాటు చేస్తారు. 

ఇండియన్‌ రైల్వేలో సగటు కోచ్ పొడవు దాదాపు 25 మీటర్లు, దీని కారణంగా గరిష్టంగా 24 కోచ్‌లు, ఒక ఇంజన్ మొత్తం 650 మీటర్లలో ప్లాట్‌ఫామ్‌పై రైలు ఆగుతుంది.