జొమాటోకు.. హిందూ నేత హత్యకు లింకేంటి..?
ఉత్తర ప్రదేశ్లో సంచలనం సృష్టించిన హిందూ మహాసభ నేత కమలేష్ తివారీ హత్య కేసు దర్యాప్తు వేగవంతం అవుతోంది. దీంతో ఈ కేసులో ఆసక్తి కర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ హత్యకు సంబంధించి పలువురు అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తాజాగా ఈ హత్యకేసులో జొమాటో సంస్థ కూడా బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు చెందిన ఓ డెలివరీ బాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) పోలీసులు.. […]
ఉత్తర ప్రదేశ్లో సంచలనం సృష్టించిన హిందూ మహాసభ నేత కమలేష్ తివారీ హత్య కేసు దర్యాప్తు వేగవంతం అవుతోంది. దీంతో ఈ కేసులో ఆసక్తి కర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే ఈ హత్యకు సంబంధించి పలువురు అనుమానితులను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే తాజాగా ఈ హత్యకేసులో జొమాటో సంస్థ కూడా బుక్ అయినట్లు తెలుస్తోంది. ఈ సంస్థకు చెందిన ఓ డెలివరీ బాయ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
గుజరాత్ ఏటీఎస్ (యాంటీ టెర్రరిజం స్క్వాడ్) పోలీసులు.. రాజస్థాన్ సరిహద్దుల్లో ఈ హత్యకేసులో నిందితులుగా ఉన్న అష్ఫఖ్ హుస్సేన్, మొయినుద్దీన్ పఠాన్లను అరెస్టు చేశారు. అయితే వీరిలో మొయినుద్దీన్ జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేసేవాడని తేలింది. దీంతో ఒక్కసారిగా జొమాటో కస్టమర్లు ఖంగు తిన్నారు. అంతేకాదు.. జొమాటో సంస్థ.. సర్వీసును ఉపయోగించుకునే వినియోగదారులకు.. భద్రత విషయంలో హామీ ఇవ్వాలని ఆ కంపెనీని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో జొమాటో అధికారులు స్పందించారు. సంస్థకు చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ నిందితుడు మొయినుద్దీన్ పఠాన్ 2019 ఆగస్ట్ 17న సూరత్లో తమ సంస్థలో చేరినట్లు తెలిపారు. సంస్థలో చేరే ముందు.. అతని ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, గత కోర్టు రికార్డులన్నింటినీ.. స్వతంత్ర సంస్థ ద్వారా సర్వే చేయించినట్లు పేర్కొన్నారు. అయితే పఠాన్ అక్టోబరు 6న చివరి డెలివరీ చేశాడని.. ఆ తర్వాత తనంతట తానే తమ కంపెనీలో పని చేయడం మానేసినట్లు చెప్పారు.
జొమాటో చట్టానికి కట్టుబడి ఉండే, బాధ్యతాయుతమైన సంస్థ అని.. ఈ హత్యకేసు దర్యాప్తులో సహకరిస్తామని సంబంధిత అధికారులకు తెలిపామన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిని ఎవరినీ ఉపేక్షించబోమన్నారు. అంతేకాదు.. నిందితుడిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తమ కస్టమర్ల భద్రతకు తాము అత్యున్నత ప్రాధాన్యమిస్తామన్నారు.
కాగా, ఉత్తర ప్రదేశ్ లక్నోకి చెందిన హిందూ మహాసభ నేత కమలేష్ తివారీని ఈ నెల 18న ఆయన నివాసంలోనే హత్య చేశారు. ఇద్దరు వ్యక్తులు వచ్చి, కమలేష్కు దీపావళి సందర్భంగా స్వీట్లు ఇస్తామని చెప్తూ.. ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత కమలేష్ తివారీని అతి దారుణంగా హత్య చేశారు దుండగులు.