ఎమ్మెల్యే శ్రీదేవి గొప్ప మనసు : గాయపడ్డ వ్యక్తికి రోడ్డుపైనే ప్రాథమిక వైద్యం
తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన మంచి మనసు చాటుకున్నారు. ఆమె ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఉండటాన్ని గమనించి..వెంటనే స్పందించారు.
YCP MLA Undavalli Sridevi : తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన మంచి మనసు చాటుకున్నారు. ఆమె ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి ఉండటాన్ని గమనించి..వెంటనే స్పందించారు. కారు ఆపి బాధితుడి దగ్గరికి వెళ్లి..గాయాల తీవ్రత తెలుసుకున్నారు. ఆమె డాక్టర్ కావడంతో..తన వృత్తి ధర్మాన్ని పాటించి గాయపడ్డ వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు.
గురువారం సాయంత్రం పిడుగురాళ్ల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. కరోనా భయంతో అక్కడ ఉన్న వాళ్లెవరూ బాధితుడి దగ్గరికి వెళ్లేందుకు సాహసించకపోడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పెట్రోలింగ్ వాహనంలో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.
బాధితుడికి ప్రథమ చికిత్స అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి స్థానికులతో మాట్లాడారు. ప్రమాదంలో ఉన్న వ్యక్తికి సాయం చెయ్యాలని.. అలా దూరం నుంచి చూస్తూ ఉండటం సరైన విధానం కాదని అన్నారు. కరోనా భయం ఉంటే తగిన జాగ్రత్తలు పాటిస్తూ సాయం చేయాలని సూచించారు. ప్రమాదం జరగ్గానే వెంటనే స్పందించి తన మంచి మనసు చాటుకున్న ఎమ్మెల్యే శ్రీదేవిపై స్థానికులు ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: బెజవాడ దుర్గమ్మ గుడిలో కరోనా కలవరం