అవేం మోదీ, జగన్ డబ్బులు కావు.. అంబటి రాంబాబు ఫైర్
కరోనా వైరస్ వ్యాప్తితో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు
కరోనా వైరస్ వ్యాప్తితో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల్లోనూ ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. సామాన్యుడు బయటకు రాలేని పరిస్థితుల్లో పేదలకు నిత్యావసరాలతో పాటు రూ. 1,000 ఆర్థిక సాయం పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే.. దానిపైనా విమర్శలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సొమ్మును పంచుతున్నామని బీజేపీ నేతలు అంటున్నారని, ఆ డబ్బు ప్రధాని మోదీది.. సీఎం జగన్ది కాదని, ప్రజల సొమ్ము అని ఆయన వివరించారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్రం నిధులు విడుదల చేసిందని, ఏపీతో పాటు మరో 13 రాష్ట్రాలకు నిధులు విడుదల చేశారని, అంతేగానీ ఏపీకి ప్రత్యేకంగా ఏం కేటాయించలేదని ఆయన గుర్తుచేశారు. వెయ్యి ఇచ్చి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలన్నట్టు ఓ వీడియోను సృష్టించారని, కన్నా లక్ష్మీనారాయణకు చిత్తశుద్ధి ఉంటే ఆ వీడియో ఎక్కడిదో బయటపెట్టాలని అంబటి డిమాండ్ చేశారు.
కరోనాను ఎదుర్కొనేందుకు దేశమంతా సంఘటితంగా పోరాటం చేస్తుంటే.. చంద్రబాబు మాత్రం రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు చాలా కష్టాల్లో ఉన్నాయని, కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవాలన్నదే సీఎం జగన్ లక్ష్యమని ఆయన అన్నారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు అహర్నిశలు శ్రమిస్తుంటే.. టీడీపీ నేతలు ట్విట్టర్లో అడ్డగోలుగా ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, కన్నా లక్ష్మీనారాయణ విధానాలు ఒకేలా ఉన్నాయని అంబటి రాంబాబు తెలిపారు.
Read This Story Also: లాక్డౌన్లో జాలీ రైడ్.. నటికి గాయాలు..!