బెట్టింగ్ భూతానికి మరో యువకుడి బలి

యువతకు ఆహ్లాదం, ఆనందం అందించాల్సిన ఆటలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి.

బెట్టింగ్ భూతానికి మరో యువకుడి బలి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 04, 2020 | 3:16 PM

యువతకు ఆహ్లాదం, ఆనందం అందించాల్సిన ఆటలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కేవలం శారీర దారుఢ్యంకోసం, గేమ్‌ స్పిరిట్‌ కోసం ఆడాల్సిన ఆటలు యువతను పెడదారిన పట్టిస్తున్నాయి. ఇతర ఆటల మాట ఎలా ఉన్నా.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ ఆంతా ఇంతా కాదు.. టీమ్‌తో కలిసి ఆడాల్సిన ఆటలు కాస్తా ప్రస్తుతం టీమ్‌గా ఆటగాళ్ల పనితీరుపై, ఆట గెలుపోటములపై అంచనాలు వేయాల్సింది పోయి, బెట్టింగులు, పందాలు పెట్టే పరిస్థితికి వచ్చింది. అందుకు ఐపీఎల్‌ బాగా సహకరిస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌ వచ్చిందంటే కొందరు బెట్టింగ్ రాయుళ్లకు పండుగగా మారింది. కొందరైతే దీనిమీదనే ఆదారపడి రూ. లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. సంపాదించేవారి మాట ఎరుగు అప్పులు చేసి మరీ పందాలు కాస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది.

నగరంలోని పంజాగుట్టలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడి నష్టపోవడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన సోనుకుమార్‌ (19) పంజాగుట్ట డివిజన్‌ మార్కెట్‌ బస్తీలో నివసిస్తుంటాడు. నిమ్స్‌ సమీపంలో కొబ్బరిబొండాలు అమ్ముతూ జీవిస్తుంటాడు. ఇతను కొంత కాలంగా ఐపీఎల్‌ క్రికెట్‌లో బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. దీంతో వేల రూపాయల్లో పందాలు కాస్తున్నాడు. ఇందుకోసం పరిచయస్తుల వద్ద కూడా అప్పులు చేసిన బెట్టింగ్ పెట్టాడు. దీంతో తీవ్రంగా నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. తట్టుకోలేని సోనుకుమార్‌ మంగళవారం ఉదయం తను నివసించే గదిలోని బాత్‌రూమ్‌లో ఉరేసుకుని ప్రాణాలొదిలాడు. మృతుడి సోదరుడు అర్జున్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు.