విదేశీ భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవలు
అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో భక్తులు ఆలయాలకు వెళ్ళాలంటే జంకుతున్నారు. దీంతో మరోసారి భక్తుల సౌకర్యార్ధం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని ఆన్ లైన్ పూజలకు అవకాశం కల్పిస్తున్నాయి ప్రధాన ఆలయాలు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ప్రభావం ఆలయాల మీద పడింది. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో కరోనా వైరస్ నేపధ్యంలో భక్తుల దర్శనాలపై అంక్షలు విధించారు. ప్రముఖ ఆలయాలను మూసివేసి కేవలం నిత్య పూజలు కొనసాగిస్తున్నాయి. ఇక, కరోనా అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ కరోనా వ్యాప్తి పెరుగుతుండడంతో భక్తులు ఆలయాలకు వెళ్ళాలంటే జంకుతున్నారు. దీంతో మరోసారి భక్తుల సౌకర్యార్ధం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకుని ఆన్ లైన్ పూజలకు అవకాశం కల్పిస్తున్నాయి ప్రధాన ఆలయాలు.
దేవున్ని నేరుగా ఆలయానికి వెళ్లి చూడకపోయినప్పటికీ ఆన్లైన్లో అర్చనలు, పూజలు చేయించే అవకాశం కల్పిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భక్తులకు తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో ఆన్లైన్ పూజా సౌకర్యాన్ని కల్పించేందుకు దేవాదాయశాఖ చర్యలు చేపట్టింది. ఇకపై ఆన్లైన్లో తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహించుకునే వీలు కల్పిస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు ఇతర ఏ శుభకార్యాన్ని అయినా పురస్కరించుకుని విదేశాల్లో ఉంటున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా ఈ-హుండీ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణ సుప్రసిద్ధ ఆలయం యాదాద్రి లక్ష్మీనరసింహుడి అర్జిత సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, కొండగట్టు హనుమాన్ దేవాలయం, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాల్లో ఈ అవకాశాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఆలయంలో సాధారణ అర్చన, పూజలకు ఒక రేటు, సుదర్శన హోమానికి చేయించడానికి ఇంకో రేటు నిర్ణయించారు. పూజలకు సంబంధించిన రుసుమును వెబ్సైట్లో చెల్లించి పూజలు చేయించుకోవచ్చని ఆలయ అధికారులు చెప్తున్నారు. అల్లంత దూరాన్న ఉన్న ఆన్లైన్లో స్వామి వారి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు అధికారులు.